వరంగల్ రూరల్: నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసులు కోరడా ఝళిపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నర్సంపేటలోని విత్తన దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.41 లక్షల విలువైన నకిలీ మిరప విత్తనాలను పట్టుకున్నారు. మొత్తం 1,677 నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో కూడా భారీగా నకిలీ మిరప విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని జూలూర్పాడ్లో రూ.1.50 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్చేసి, 120 ప్యాకెట్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నాసిరకం విత్తన ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్నది. మండల, జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులతోపాటు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఐదు రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 878 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సీడ్ టాస్క్ఫోర్స్ ఇంచార్జి, నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. నకిలీ విత్తనాలకు సంబంధించి 101 కేసులు నమోదుచేసి, 159 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నాసిరకం విత్తనాలు విక్రయించేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తున్నారు. వరుసగా రెండోసారి పట్టుబడితే పీడీయాక్ట్ కింద బుక్ చేస్తున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే 28 మందిపై పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.