హనుమకొండ : అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయని ఆయా ఏజెన్సీలపై జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని అభివృద్ధి పనులలో వేగం పెంచాలని సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతూ, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలసి పశ్చిమ వరంగల్ నియోజకవర్గం పరిథిలోని స్మార్ట్ సిటీ, సీఎంఏ, జనరల్ ఫండ్, కుడా తదితర పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలిచి పనులు త్వరితగతిన చేయాలని సూచించారు. పట్టణ ప్రగతిలో అభివృద్ధికి సంబంధించిన వచ్చిన వినతులపై దృష్టి సారించాలని అన్నారు. హనుమకొండ బస్స్టేషన్ నవీకరణకు ఆర్టీసీ ఆర్ఎం, స్మార్ట్ సిటీ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భద్రకాళి దేవాలయం వద్ద మాడ వీధులలో చేపట్టే అభివృద్ధి పనులు భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. బంధం చెరువు సుందరీకరణ, ఇరిగేషన్, స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సమర్పించాలని ఆదేశించారు. గోపాలపురం ఊర చెరువు నుంచి ప్రెసిడెన్సీ
స్కూల్ వరకు నాలపై ఇరిగేషన్ శాఖ ద్వారా వరద నివారణలకు చేపట్టే పనులను తక్షణమే ప్రారంభించాలని పేర్కొన్నారు. ఆయా అభివృద్ధి పనులలో జాప్యం జరుగకుండా సకాలంలో పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని చీఫ్ విప్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భాస్కర్, డీఎం భానుకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వాసుచంద్ర, కుడా పీవో అజిత్ రెడ్డి, స్మార్ట్ సిటీ పీఎంవో ఆనంద్వోలేటి, ఈఈ లు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ కుమార్, లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ రాజం, డీఈలు తదితరులు పాల్గొన్నారు.