మానుకోట జిల్లాలో 151 ఆక్సిజన్ పడకలు
మరో 100 ఐసొలేషన్ బెడ్లు
కరోనా బాధితులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం
కంటికి రెప్పలా చూసుకుంటున్న వైద్యసిబ్బంది
మహబూబాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ):మహబూబాబాద్ జిల్లా వైద్యశాలలో గతేడాది 12పడకలతో ప్రారంభమైన కొవిడ్వార్డులో నేడు 80 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని మండలాల్లో మొత్తం 71 బెడ్లు ఉండగా, మానుకోట ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో 100 పడకలతో కూడిన ఐసొలేషన్ కేంద్రం సేవలందిస్తున్నది. పాజిటివ్ వచ్చి దవాఖానలో చేరినప్పటి నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు వైద్యులు, సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందిస్తూ రోగుల్లో మనోధైర్యం నింపుతున్నారు. డాక్టర్ల నిర్విరామ సేవలను బాధితులు వేనోళ్లా కొనియాడుతున్నారు.
కరోనా బాధితులకు మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతోంది. పేషెంట్లను వైద్యులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటూ మంచి ఆహారం అందిస్తున్నారు. కౌన్సెలింగ్తో మనోధైర్యం నింపుతున్నారు. జిల్లా దవాఖానలో గతేడాది 12 పడకలతో ప్రారంభమైన కొవిడ్ వార్డులో నేడు 80వరకు పెరిగాయి. 40 ఆక్సిజన్ బెడ్లు, 10 వెంటిలేటర్ బెడ్లున్నాయి. ఇటీవల 30 పడకల ఆక్సిజన్ బెడ్ల వార్డును మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 21, తొర్రూరులో 30, గార్లలో 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ వార్డుల్లో వైద్యులు, సిబ్బంది మూడు షిప్టులుగా నిరంతరాయం సేవలందిస్తున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో 100 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. పాజిటివ్ వచ్చి ఇంట్లో ఉండే అవకాశం లేనివారు దీనిని వినియోగించుకుంటున్నారు.
మెరుగైన చికిత్స.. నాణ్యమైన భోజనం
జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డుల్లో బాధితులకు వైద్య సిబ్బంది మెరుగైన సేవలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. నిత్యం బీపీ, షుగర్ టెస్టులు, ఆక్సిజన్ లెవల్స్ చూస్తున్నారు. ఉదయం ఉప్మా, ఇడ్లి, బ్రెడ్, పాలు ఇస్తున్నారు. మధ్యాహ్నం అన్నం, కోడిగుడ్డు, రెండు రకాల కూరలు, సాంబారు, పెరుగు, రాత్రికి అన్నం, కూరలు, చారు, పెరుగు అందిస్తున్నారు. రోగుల వద్ద ఎవరైనా సహాయకులు ఉంటే వారికి కూడా నాణ్యమైన భోజనం ఇస్తున్నారు. ఇలా మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం అందించడంపై కరోనా బాధితులు, వారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. 24 గంటలూ వైద్యులు, సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కలిపి మొత్తం 151 ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్ల ద్వారా సేవలందిస్తున్నాం. ఇవే కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 100 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేశాం.