దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పథకాలు
రైతుబంధు, మిషన్ భగీరథ లాగే దళితబంధు
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం
ప్రగతి భవన్లో దళిత ప్రతినిధుల సమావేశం
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతినిధులు హాజరు
వరంగల్, జూలై26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఉద్యమ నేతగా తెలంగాణను సాధించిన కేసీఆర్ తన సమర్థపాలనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ తరహాలోనే ఇప్పుడు దళితబంధు పథకం కొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. దళితబంధుపై ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ విషయాలను ఆయన ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ‘మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని విజయవంతగా అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను పూర్తి పాదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అమలు చేస్తున్నారు.
మిషన్ భగీరథ పథకం బ్రహ్మాండగా విజయవంతమైంది. దీన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది చాలారకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే గొప్పది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. తెలంగాణలో ఇప్పుడు 1.10 కోట్ల ఎకరాల్లో వరిపంట సాగవుతోంది. తెలంగాణ రాష్ట్రం గత సీజన్లో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండించింది. సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని ప్రారంభించినా పూర్తి అధ్యయనం చేస్తారు. పకడ్బందీ కార్యాచరణతో విజయవంతంగా అమలు చేస్తారు. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్పా విషయమేమీ లేదు. దళితబంధు పథకంతో సీఎం కేసీఆర్ దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో, తెలంగాణలో విజయవంతమైతే దేశానికి ఇది నమూనా అవుతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను ప్రధానమంత్రి మోదీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దళితబంధు కూడా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా అమలుకు ఒత్తిడి వస్తుంది. సీఎం కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసం ఉంది.
ఆయన పట్టుకుంటే ఫలితం వచ్చే వరకు వదలరు. మధ్యవర్తులు లేకుండా, బ్యాంకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ప్రభుత్వం నేరుగా దళిత కుటుంబాలకు సాయం చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలను వ్యాపారం, వాణిజ్యం, ట్రాక్టర్లు, ఆటోలు, దుకాణాలు ఏ రంగంలోనైనా పెట్టుబడిగా పెట్టుకొని వృద్ధిలోకి రావాలి. దళితబంధు పొందిన కుటుంబాలు మరోసారి వెనక్కి చూసుకోవద్దు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏదో చేశాయనే అపవాదు, విమర్శలు ఉన్నాయి. దళితబంధుతో ఈ విమర్శలు పూర్తిగా ఆగిపోవాలి. ఈ పథకం విజయవంతమనేది హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలపై ఆధారపడి ఉంది. అక్కడ సక్సెస్ అయితే తెలంగాణవ్యాప్తంగా విజయవంతమవుతుంది. అప్పుడు దేశానికి ఈ పథకం అవసరమని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. హుజూరాబాద్లో ఈ పథకం లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఎదగాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి’ అని కడియం శ్రీహరి అన్నారు.