జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచే శ్రీకారం
కార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, సత్యవతి
ఈ నెల 31వరకు పూర్తి
ఉమ్మడి జిల్లాలో 29వేల కొత్త కార్డులు
ఆగస్టు నుంచే వీరికి బియ్యం అందజేత
వరంగల్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సోమవారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానుంది. కొత్త కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన కార్డులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు బియ్యం పంప ణీ చేస్తోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి మొత్తం 29,220 కార్డులు మంజూరు కాగా, మంత్రు లు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 31లోపు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అన్నింటా ఆసరా..
ఆరు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 10.85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా 29,220 కార్డులను పంపిణీ చేయనుంది. అన్ని కలిపితే ఆరు జిల్లాల్లో కలిపి 11.14 లక్షల రేషన్ కార్డులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా ఆసరా కల్పి స్తోంది. రేషన్ కార్డుతో పేదలకు ఎంతో మేలు జరగనుంది. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో వారికి ఆహార భద్రత ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తోంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షే మ పథకాలకు అర్హత ఉంటుంది. ఈ కుటుంబాల్లోని వారి ఆసరా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తుంది. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు వారికి వర్తిస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద అర్హత ఉంటుంది. ఆపద సమయంలో ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నది. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీలో అన్ని వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగానే అమలవుతాయి.