‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి సినీ పెద్దలందరూ కలిసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వారి నిర్ణయానికి కట్టుబడి తాను పోటీ నుంచి తప్పుకొంటానని అన్నారు మంచు విష్ణు. ఏకగ్రీవం కాని పక్షంలో తాను పోటీకి సిద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు మంచు విష్ణు సోమవారం ఓ ప్రకటనను విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం తెలుగు చిత్రసీమ అగ్రపథంలో దూసుకుపోతోంది. మన ఇండస్ట్రీలో ఉన్న 24 విభాగాల్లో యూనియన్లలో సభ్యత్వం ఉన్నవాళ్లే సినిమాల్లో పనిచేయాలి. మెంబర్షిప్ లేని వారు చాలా మంది పనిచేస్తున్నారు. దాంతో సభ్యత్వం ఉన్న వారికి పని దొరకడం లేదు. అందుకే సినిమాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ‘మా’ మెంబర్ అవ్వాల్సిందే. ఇలా వృద్ధి చెందిన ‘మా’ ఫ్యామిలీ మెంబర్స్ అందరి వివరాల్ని ప్రతి ప్రొడక్షన్ హౌస్, ఓటీటీ సంస్థలకు పంపించి అందులో పేర్కొన్న నటీనటులకు ప్రాధాన్యమివ్వాలని కోరాలి.
‘మా’ అసోసియేషన్ బలపడాలి. మనమంతా నిర్మాతలకు సహకరించాలి. నేను సినీ పెద్దలను గౌరవిస్తా. వాళ్ల సలహాలు పాటిస్తా. ఇప్పటివరకు జరిగిన ప్రతి ‘మా’ ఎన్నికల్లో బిల్డింగ్ సమస్య ప్రధాన అజెండాగా వచ్చింది. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతిపైసా నేనే ఇస్తాను. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ను నేను నిర్మిస్తాను. ‘మా’ అసోసియేషన్లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు అని అనుకుంటున్నా. గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్లి ఎలా మంచి పనులు చేయాలో ఆలోచిద్దాం. ‘మా’ ప్రెసిడెంట్గా నన్ను ఆశీర్విదిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.