అజ్మీర్ : మహిళలను అభ్యంతరకరంగా తాకుతూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పలువురు చితకబాది చెప్పుల దండతో ఊరేగించిన ఉదంతం రాజస్ధాన్లోని భిల్వారాలో వెలుగుచూసింది. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగుచూసింది. భిల్వారాకు సమీపంలోని ధాలియో క ఖేడా ప్రాంతంలో ఈ కేసు బయటపడింది. గ్రామానికి చెందిన మహిళ ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెను తాకరాని చోట తాకేందుకు ప్రయత్నించాడు.
మహిళ కేకులు వేయడంతో స్ధానికులు అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో పలువురు మహిళల పట్ల యువకుడు ఇలాగే వ్యవహరించాడని ఫిర్యాదులు వచ్చాయి. నిందితుడి తీరుతో ఆగ్రహించిన గ్రామస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నిందితుడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తూ అతడిపై మూత్రం పోశారు. ఈ ఘటనను కొందరు గ్రామస్తులు వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.