న్యూఢిల్లీ : భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా మంగళవారం ఒక్కరోజులో అత్యధిక మందికి వ్యాక్సినేషన్ చేపట్టిన నేపథ్యంలో సత్వర వ్యాక్సినేషన్తోనే దేశంలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మనం త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే స్కూళ్లు, విద్యా, వాణిజ్య సంస్థలు తెరవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ గాడినపడేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. శీఘ్రగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళితేనే ఇది సాధ్యపడుతుందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన క్రమంలో ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పారు.
భారతీయ వ్యాక్సిన్లు సురక్షితం కాదని కొందరు అపోహ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్లు అత్యవసర వాడకానికి ఆమోదం పొందాయని డాక్టర్ పాల్ వివరించారు. ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సెకండ్ వేవ్ వ్యాప్తిని వైద్య సిబ్బంది దీటుగా నిలువరించగలిగారని చెప్పారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలే ఇన్ఫెక్షన్కు గురయ్యారని, లేనిపక్షంలో సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో మన దవాఖానాలు చేతులెత్తేసి ఉండేవని అన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకుని ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందాలని కోరారు.