న్యూఢిల్లీ: మిల్కా సింగ్. ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో అగ్రగణ్యుడు. స్వాతంత్య్ర భారతావనిలో అమోఘ ప్రతిభ కలిగిన స్ప్రింటర్. దేశ విభజన సమయంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నా.. అత్యున్నత క్రీడాకారుడిగా ఎదిగిన మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఎంతో ప్రేరణాత్మకం. విభజన సమయంలో పేరెంట్స్ ను కోల్పోయాడు. పాకిస్థాన్లో మిల్కా పేరెంట్స్ హత్యకు గురయ్యారు. ఢిల్లీలో శరణార్థి క్యాంపులో ఆయన తన బాల్యాన్ని గడిపారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ.. బ్రతుకు జీవితాన్ని సాగించారు. జైలు కూడా వెళ్లాడు. ఆర్మీలో చేరేందుకు పలుమార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. కానీ అసాధారణ ప్రతిభతో ఆర్మీలో చేరాడు. మెరుపు వేగంతో పరుగులు తీశాడు. ఆ నైపుణ్యాన్ని గమనించిన ఆర్మీ అధికారులు… మిల్కా సింగ్ను ఫ్లయింగ్ సిక్కుగా కీర్తించారు. ప్రతిభకు పదునుపెడుతూ తన కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు. భారత దేశ అథ్లెట్లు కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్లో రాణిస్తారన్న సందేశాన్ని ఆయన వినిపించారు. దురదృష్టవశాత్తు 91 ఏళ్ల మిల్కా సింగ్ శుక్రవారం కరోనా వల్ల ప్రాణాలు విడిచారు. ఆ అద్భుత స్ప్రింటర్ను భారత్ ఎన్నటికీ మరచిపోదు. ఆయన సాధించిన విజయాలు ఈ దేశానికి గర్వకారణం.
చిన్న నాటి నుంచి ట్రాక్ అంటే మిల్కాకు ఎనలేని ఇష్టం. పరుగులు తీయడం ఆయనకు అతి సులువైన పని. కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నా.. రన్నింగ్ ట్యాలెంట్ను మాత్రం ఆయన ఎన్నడూ మరవలేదు. మిల్కా అందుకున్న మెడల్స్ ఆయన ఘనతను చాటుతాయి. లెజండరీ అథ్లెట్గా రూపుదిద్దుకున్న మిల్కా.. ఏషియన్ గేమ్స్లో నాలుగు సార్లు గోల్డ్ మెడల్స్ సాధించాడు. 1958లో కామన్వెల్త్ చాంపియన్షిప్లోనూ మెడల్ పట్టేశాడు. అయితే 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్.. మిల్కా జీవితంలో మరుపురాని రోజు. ఆ ఈవెంట్లో 400 మీటర్ల ఫైనల్లో పాల్గొన్న ఫ్లయింగ్ సిక్.. కేవలం ఒకే ఒక సెకను తేడాతో కాంస్య పతకాన్ని మిస్ అయ్యాడు. పతకాన్ని అందుకోలేకపోయినా.. మిల్కా ప్రదర్శిన క్రీడా పోరాట స్పూర్తి అనిర్వచనీయం. రోమ్లో జరిగిన ఈవెంట్లో ఆయన నెలకొల్పిన రికార్డు దాదాపు 38 ఏళ్ల పాటు జాతీయ రికార్డుగానే మిగిలిపోయింది. లక్షలాది మంది అథ్లెట్లకు ప్రేరణగా నిలిచిన మిల్కాకు 1959లో పద్మ శ్రీ అవార్డు దక్కింది.
అథ్లెటిక్స్ క్రీడారంగంలో భారతీయ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటింది మిల్కానే. 1958లో జరిగిన బ్రిటీష్ అండ్ కామన్వెల్త్ క్రీడల్లో 440 యార్డ్స్ రేసులో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. దాంతో ఇండియా కీర్తి అన్ని దిశలూ వ్యాపించింది. వ్యక్తిగత ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు మిల్కానే. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఆయన్ను సన్మానించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో మిల్కా రికార్డు మహాద్భుతం. 80 రేసుల్లో పాల్గొన్న మిల్కా 77 సార్లు గెలిచాడు. రోమ్ ఒలింపిక్స్లో 400మీటర్ల ఫైనల్ను కేవలం 45.6 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 0.1 సెకన్ల తేడాతో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు.
మిల్కా జీవితకథ ఆధారంగా బాలీవుడ్లో భాగ్ మిల్కా భాగ్ చిత్రాన్ని తీశారు. ఫర్హన్ అక్తర్ ఆ ఫిల్మ్లో ప్రధాన పాత్ర పోషించాడు. అద్భుతంగా తీసిన ఆ సినిమా.. బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు.. మిల్కా ట్యాలెంట్ను నేటి తరానికి పరిచయం చేసింది. రోమ్లో మిల్కా సాధించిన రికార్డు 38 ఏళ్లు అలాగే ఉండిపోయింది. అయితే 1998లో కోల్కతాలో జరిగిన జాతీయ మీట్లో ఆ రికార్డును పరంజీత్ సింగ్ బ్రేక్ చేశాడు. తన రికార్డును బద్దలు చేసిన వాళ్లకు రెండు లక్షలు ఇస్తానన్నాడు. కానీ ఆ వాగ్ధానాన్ని మిల్కా నిలబెట్టుకోలేదు. ఎందుకంటే విదేశీ పోటీల్లో ఆ రికార్డు బ్రేక్ కాలేదన్నారు.
పంజాబ్లోని గోవింద్పురాలో పుట్టిన మిల్కా.. 15 ఏళ్లకు పాక్ నుంచి పారిపోయి ఢిల్లీ చేరుకున్నాడు. దేశ విభజన సమయంలో జరిగిన ఘర్షణల్లో పేరెంట్స్ను కోల్పోయాడు. బూట్లు పాలిష్ చేశాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో షాపు క్లీనర్గా చేశాడు. 1952లో నాలుగవ ప్రయత్నంలో అతను ఆర్మీలో చేరాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో క్రాస్ కంట్రీ రేసులో పాల్గొన్న మిల్కా.. అక్కడ నుంచి తన దశను మార్చేశాడు. కోడ్ గురుదేవ్ సింగ్ నేతృత్వంలో రాటుదేలాడు. ఆర్మీ క్యాంపులో టాప్ 10లో నిలిచి ఒక అదనపు గ్లాసు పాలను గిఫ్ట్గా గెలుచుకున్నాడు. 1956 ఒలింపిక్స్కు ఎంపికైన మిల్కా.. హాట్స్లోనే వెనుదిరిగాడు. కానీ ఆ అనుభవం ఎంతో ఉపకరించింది. 400 మీటర్స్ విన్నర్ చార్లెస్ జెన్కిన్స్ నుంచి శిక్షణ పద్ధతులను నేర్చుకున్నాడు.
తీవ్రమైన శిక్షణ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు రక్తం కక్కినట్లు తన ఆటోబయోగ్రఫీలో మిల్కా చెప్పాడు. అయితే రోమ్ ఒలింపిక్స్కు ముందు 1960లో జరిగిన ఇండో-పాక్ స్పోర్ట్స్ మీట్ ప్రత్యేకమైంది. ఈ పోటీల్లో పాకిస్థాన్ స్ప్రింటర్ అబ్దుల్ ఖాలిక్ను మిల్కా ఓడించిన తీరు అసాధారణం. ఆ సమయంలో ఆసియా ఫాస్టెస్ట్ మ్యాన్గా ఖాలిక్ను భావిస్తుండేవారు. 1958 ఆసియా క్రీడల్లో 100మీటర్ల ఈవెంట్లో గోల్డ్, 400 మీటర్ల ఈవెంట్లోనూ ఖాలిక్ గోల్డ్ సాధించాడు. అయితే ఇండో-పాక్ స్పోర్ట్స్ మీట్లో అబ్దుల్ ఖాలిక్ను మిల్కా ఓడించడంతో అతని ఖ్యాతి మరింత పెరిగింది.
తిరిగి పాకిస్థాన్కు వెళ్లేందుకు మిల్కా నిరాకరించాడు. 200 మీటర్ల రేసులో పాక్ అథ్లెట్ ఖాలిక్ను ఓడించిన తర్వాత అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్.. మిల్కా సింగ్ను ద ఫ్లయింగ్ సిక్కు అంటూ గ్రీట్ చేశారు. 1964 ఒలింపిక్స్ తర్వాత మిల్కా రిటైర్ అయ్యారు. పంజాబ్ ప్రభుత్వంలో కొన్నాళ్లు స్పోర్ట్స్ డైరక్టర్గా చేశారు. ఇండియన్ ఆర్మీని వదిలేసిన తర్వాత ఢిల్లీ నుంచి చంఢీఘడ్కు మకాం మార్చేశాడు. స్కూల్స్లో కచ్చితంగా గేమ్స్ పీరియడ్ ఉండాలని 1991లో మిల్కా ఓ ప్రతిపాదన చేశారు. భారత వాలీబాల్ జట్టు కెప్టెన్ నిర్మల్ కౌర్ను 1963లో మిల్కా సింగ్ పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో నేటి తరం భారత అథ్లెట్లకు మిల్కా సింగ్ నిస్సందేహంగా ఆదర్శుడు.