నటి వరలక్ష్మీ శరత్కుమార్ కొవిడ్ చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి అనేక వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ముఖ్యంగా కరోనాతో ముడిపడిన మానసిక సమస్యలను చర్చించడానికి సంకోచించకూడదని ఆమె సలహా ఇస్తున్నారు.
“కరోనా మొదటి దశ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ అనుభవంతో రెండోదశను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. మా ‘సేవ్ శక్తి ఫౌండేషన్’ నేతృత్వంలో వీధికుక్కలకు ఆహారం అందిస్తున్నాం. నా చేతుల మీదుగా 700 కుక్కలను జంతు ప్రేమికులకు దత్తత ఇచ్చాను. జంతువుల సంగతి సరే, మనుషుల స్వభావాలే విచిత్రంగా అనిపిస్తున్నాయి. నేను ఓ వ్యక్తికోసం వ్యాక్సినేషన్కు సమయం తీసుకున్నాను. అతను ఏవో కారణాలు చెప్పి రాలేదు. ఎందుకిలా చేశావని నిలదీస్తే, ‘వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుందని భయమేసిందనీ, ఒళ్లు నొప్పలుకూడా వస్తాయని హెచ్చరిస్తున్నారనీ, అందుకే రాలేకపోయాననీ’ చెప్పాడు. ఎంత అజ్ఞానం! అసౌకర్యంగా అనిపిస్తుందని, బండిమీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మానేస్తామా?’
అని అంటారామె.