కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం

- ఫ్రంట్లైన్ వారియర్స్కు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కలెక్టర్ హరిత
ఆత్మకూరు, జనవరి 16 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి మనదేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం గర్వకారణమని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా లైవ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేసి మాట్లాడుతూ.. ఫ్రంట్లైన్ వారియర్స్, ఆశ కార్యకర్తలు, శానిటేషన్ వర్క ర్లు, పోలీసులకు ఉచితంగా వ్యాక్సిన్ అం దించనున్నట్లు తెలిపారు. 139 కోట్ల జనా భా ఉన్న భారతదేశం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు. కానీ, మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎం తో ఉపయోగకరమన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. టీకా వేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది కలిగినా వైద్యాధికారిని సంప్రదించాలన్నా రు. కొవిడ్ కట్టడికి ముందు వరుసలో నిలిచిన వైద్యసిబ్బంది, ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్రీనివా స్, తహసీల్దార్ విక్రంకుమార్, ఎంపీడీవో నర్మద, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, సర్పంచ్ పర్వతగిరి రాజు, వైద్యాధికారులు అశ్విన్కుమార్, రణధీర్కుమార్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్త లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
87 శాతం వ్యాక్సినేషన్..
ధర్మారం, జనవరి 16 : కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 120 మందికి 104 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, మిగతా 16 మందికి (గర్భిణులు, పాలిచ్చే తల్లులు) వ్యాక్సినేషన్ను నిలిపివేసినట్లు తెలిపారు. జిల్లాలో 90 మంది వైద్య సిబ్బంది, 14 మంది అంగన్వాడీ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేశామని తెలిపారు. పరకాలలో 100 శాతం, జిల్లాలో 87 శాతం వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.