చీర వాపస్ ఇవ్వబోయి.. రూ.1.2 లక్షలు పోగొట్టుకుంది
సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన ఓ మహిళ.. ఆన్లైన్లో రూ.500 పెట్టి చీర కొని.. అది నచ్చక వాపస్ ఇవ్వడానికి యత్నించి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.1.2లక్షలు పోగొట్టుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంబర్పేటకు చెందిన ఓ మహిళ.. ఆన్లైన్లో రుద్రసిల్క్ సంస్థ వద్ద నుంచి రూ.500 పెట్టి ఒక చీర కొన్నది.. అయితే అది నచ్చకపోవడంతో దాన్ని వాపస్ ఇవ్వడానికి గూగుల్లో ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గాలించి.. అందులో ఉన్న ఒక నంబర్ను సంప్రదించింది.. తాము సంస్థ కస్టమర్కేర్ ప్రతినిధులమంటూ మాట్లాడి.. ఆ డబ్బులు వాపస్ పంపిస్తామని నమ్మించి.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని.. ఆమె ఖాతా నుంచి రూ.1.2లక్షలు కాజేశారు.
ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఐడీ క్రియేట్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటర్ యువతిని వేధిస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మరో ఘటనలో బషీర్బాగ్కు చెందిన ఓ మహిళ ఫోన్ నంబర్ను అశ్లీల వెబ్సైట్లో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బేగంపేటకు చెందిన ఓ న్యాయవాది ఫోన్ నంబర్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్చేసి ఇష్టానుసారంగా మెసేజ్లు పెడుతున్నారు. అలాగే ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాట్సాప్ నంబర్ను హ్యాక్ చేసి, గుర్తుతెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులపై సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎంఐఎం పార్టీ సోషల్మీడియా ఇన్చార్జి ఇర్ఫాన్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.