కరోనా వేళ.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సాయం చేస్తున్నారు. అలాంటి మానవతామూర్తుల జాబితా పెద్దదే. ఆ కోవకే చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో పాజిటివ్ వచ్చిన వారి కోసం మొయినాబాద్లోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 70 పడకలతో ఐసొలేషన్ కేంద్రాన్ని నెలకొల్పారు. ఉచిత వసతి, భోజనం, మందులు, వైద్యసేవలందిస్తూ.. రోగులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అక్కడి నుంచే ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తూ.. అటు ఉద్యోగ బాధ్యత..ఇటు చేయూతనిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించడంతోపాటు వారికి మూడుపూటలా భోజనం పెడుతూ ఆదుకుంటున్నారు పలువురు ఐటీ ఉద్యోగులు. ఉద్యోగంతోపాటు కొవిడ్ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల బృందం కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అత్యంత మెరుగైన మౌలిక వసతులతో కూడిన ఉచిత కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. స్వేచ్ఛ, తానా చేయూత వంటి సంస్థలతోపాటు కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో నగరశివారు మొయినాబాద్లోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 70 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
కరోనా సోకి చిన్న చిన్న ఇండ్లల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారు ఈ కేంద్రంలో చికిత్స పొందవచ్చు. ఇక్కడ ఉచిత వసతి, భోజనం, వైద్యం, మందులతోపాటు నర్సింగ్ సేవలందిస్తున్నారు. 10 మంది వైద్యులు, నలుగురు నర్సుల బృందం బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇండ్లల్లో ఐసోలేషన్ కుదరని స్వల్ప లక్షణాల నుంచి మోడరేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వారందరూ ఈ ఉచిత కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందవచ్చని ఫోరం ఆఫ్ ఐటీ ప్రతినిధులు కిరణ్చంద్ర, ప్రవీణ్లు తెలిపారు. ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో వైద్యులతో కలిసి ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కరోనా పాజిటివ్ సోకి శ్వాస సమస్యలు తలెత్తే వారికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఈ విషయాన్ని గుర్తించి కొవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సిద్ధంగా ఉంచారు. పట్టణ ప్రాంతాల నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సైతం మెరుగైన కొవిడ్ చికిత్స ఇప్పించేందుకు వీలుగా నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచుతూ 24 గంటలపాటు సేవలందించేలా ఏర్పాట్లు చేశారు.
ఓ పక్క కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఐటీ ఉద్యోగులు..కొవిడ్ కేర్ సెంటర్ నుంచే తమ ఉద్యోగాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ఫ్రం హోం ఉండడంతో కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలోనే ఉంటూ ఇక్కడినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. పాజిటివ్ బాధితులకు అండగా ఉండడమే కాదు..వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ త్వరగా కోలుకునేలా చేస్తున్నారు.
ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ బృందం కరోనా మొదటిదశ నుంచే ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించి హెల్ప్లైన్ ద్వారా సేవలందిస్తున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ఫోన్కాల్స్కు స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే పాజిటివ్ల సంఖ్య భారీగా పెరిగిపోవడం, నగరంలో, జిల్లా ఆస్పత్రుల్లోనూ బెడ్లు దొరకని పరిస్థితిని హెల్ప్లైన్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే తామే ఒక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, వారం రోజుల్లోనే కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
కరోనా రెండోదశలో నగరంతోపాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమందికి పాజిటివ్ రావడంతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు లేక కొందరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటే చేతిలో డబ్బుల్లేక చాలామంది పడుతున్న ఇబ్బందులను గమనించి కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషన్స్లో ఉన్నవారితో చర్చించి మే నెల చివరివారంలో ఏర్పాటు చేశాం. తోడుగా స్వేచ్ఛ, తానా చేయూత వంటి సంస్థలు అండగా నిలిచాయి. ప్రధానంగా తానా చేయూత సంస్థ నుంచి శశికాంత్ ఎంతో ప్రోత్సహించి, ఉచిత కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సహకరించారు. – కిరణ్చంద్ర, ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రతినిధి