హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయేండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మొదటినుంచి నిర్లక్ష్యానికి గురవుతుండడం శోచనీయమన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణి కూడా ప్రబల కారణమని సీఎం అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారుల (డీపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సీఎం సుధీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాతపద్దతులను వదిలి, నిత్యనూతనంగా ప్రజాక్షేత్రంలో మమేకమై, గ్రామాభివృద్ధికోసం తమకు అందివచ్చిన గొప్ప అవకాశాన్ని యువ కలెక్టర్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మూస ధోరణులు వైఖరులను మార్చుకొని సామర్ధ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరారు.
తమకోసం పనిచేసే ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోదాహరణలతో వారికి పలువురు ఆదర్శవంతంగా పనిచేసిన గత కలెక్టర్ల పేర్లను సీఎం ఉదహరించారు. గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ఆర్ధిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాద్యత డీపీవోలదేనని స్పష్టం చేశారు. గ్రామ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, గ్రీన్ కవరేజీ కోసం ఖర్చు అనే అంశాలు ‘చార్జుడు అకౌంట్’ కిందికి వస్తాయని, వీటికి ముందు నిధులు కేటాయించిన తర్వాతే మిగతా వాటికి చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి దొరకని పక్షంలో గ్రామ నిధుల నుంచి ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.
నిరంతరం డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవో లతో సమావేశాలు నిర్వహించాలని, అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ‘సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ఫ్’’ (ప్రజలను, గ్రామాలను కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ), అని అదనపు కలెక్టర్లు డీపీవోలకు సీఎం స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తర్వాత వాటి మీద తాత్సారం చేయకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.