హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి మూడోసారి విరుచుకుపడనుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం మరింత ముమ్మరం చేయాలని, ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు సూచించారు. ఉచిత వ్యాక్సినేషన్ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కోసం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 44వ జీఎస్టీ సమావేశంలో బీఆర్కే భవన్ నుంచి మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, వాణిజ్య పన్నుల కమిషనర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు.
దేశ అవసరాలకు తగినంతగా దేశీయంగా కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి కావడం లేదని మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లను ప్రణాళికాబద్ధంగా రాష్ర్టాలకు పంపిణీచేయాలని చెప్పారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు తదితర వైద్య సామగ్రిపై పన్నుల రాయితీ ఇవ్వాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం చేసిన సిఫారసులకు హరీశ్రావు మద్దతు తెలిపారు. కమిటీలోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, అందువల్ల ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ వల్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతిని రాబడి తగ్గిందని చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టనష్టాలను ఈ సందర్భంగా హరీశ్రావు జీఎస్టీ కౌన్సిల్కు వివరించారు. లాక్డౌన్ వల్ల ఒక్క మే నెలలోనే రూ.4,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామని తెలిపారు. ఈ నష్టాల నుంచి కోలుకొనేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచాలని విజ్ఞప్తిచేశారు.