ధరూర్/అయిజ/ శ్రీశైలం, జూన్ 11: కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం వరద రాక మొదలైంది. సుంకేసుల నుంచి 4,412 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తి ద్వారా 17,042 క్యూసెక్కుల నీరు విడుదలయింది. ఈ సీజన్లో తొలిసారిగా శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి శ్రీశైలంలో 13,314 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 810 అడుగులకు నీరు ఉన్నది. మరోవైపు కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 14,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 20,747 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. ఎగువన వర్షాలతో కర్ణాటకలోని తుంగభద్రకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది.