మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో గత రెండు రోజులుగా జూరాల ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.400 మీటర్ల వరకు నీరు మట్టం ఉన్నది. దీంతో నీటి నిల్వ 9.418 టీఎంసీలకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. 20,809 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) 17,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.