ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు
తక్షణం స్థల సేకరణ జరపాలి
రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
కొవిడ్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ శంకుస్థాపనకు సీఎం వస్తారు
సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
ఖమ్మం, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ నియంత్రణ, నకిలీ విత్తనాల బెడద, వ్యవసాయశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్థల సేకరణ వంటి అంశాలపై ఖమ్మంలోని టీటీడీసీ భవన్లో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మాట్లాడారు. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో కార్డులు జారీ కావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్కార్డు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్కు ఫోన్ చేసి కోరారు. జిల్లా వ్యాప్తంగా 69,827 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మధుసూదన్.. మంత్రికి వివరించారు. కార్డుల జారీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, కొత్తగా దరఖాస్తు చేసే అవకాశం లేదని స్పష్టంగా తెలపాలని మంత్రి సూచించారు.
ధాన్యం సేకరణలో అగ్రగామి..
ధాన్యం సేకరణలో జిల్లా అగ్రగామిగా ఉండడం అభినందనీయమని, ఇప్పటికే యాసంగి ధాన్యంలో 3 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించడంలో అధికారుల పాత్ర మరువలేనిదని అన్నారు. మిగిలిన ధాన్యం సేకరణ వారం రోజుల్లో పూర్తి కావాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందుతోందని, పంజాబ్ తర్వాత దేశంలో భారత ఆహార సంస్థ ధాన్యాన్ని అత్యధికంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలను, పెరుగుతున్న పంటల విస్తీర్ణాన్ని, దిగుబడులను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ను ఒప్పించి ఖమ్మం జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేయించినట్లు చెప్పారు. 250 ఎకరాల విస్తీర్ణంలో పార్బాయిల్డ్, రా-రైస్ మిల్లుల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం యుద్ధ ప్రతిపాదికన 150 ఎకరాల అనువైన భూమిని సేకరించాలని మంత్రి సూచించారు.
విత్తనాలు సిద్ధంగా ఉంచాలి..
ఈ వానకాలం సాగు కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి, మిర్చి పంటలను మరింతగా ప్రోత్సహించాలన్నారు. కంది, పెసరతోపాటు బీటీ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని సూచించారు. మొక్కజొన్న సాగు అంత లాభసాటి కాదన్న విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. పామాయిల్, కూరగాయల సాగు కూడా మరింత పెరిగేలా చూడాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్తో శంకుస్థాపన చేయించుకోవచ్చనని అన్నారు.
పరిశ్రమలపై దృష్టి సారించాలి: నామా
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో రైస్ మిల్లుల ఏర్పాటుతోపాటు వివిధ పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. కారం నుంచి నూనె తీసే మిల్లులు, ఇథనాల్ తయారీ వంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లాలో కొవిడ్ విస్తృతిపై మంత్రి సమీక్షించారు. లాక్డౌన్కు ముందు కొవిడ్ పాజిటివిటీ 33 శాతంగా ఉండేదని, ప్రస్తుతం అది 8 శాతానికి తగ్గిందని డీఎంహెచ్వో డాక్టర్ మాలతి వివరించారు. ఆంధ్రా సరిహద్దుల్లో రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించాలని సీపీ విష్ణు ఎస్ వారియర్కు మంత్రి సూచించారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ కానుందని అన్నారు. కారేపల్లి, కామేపల్లిల్లో కొవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, అదనపు కలెక్టర్ మధుసూదన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ సీపీ సుభాశ్ చంద్రబోస్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.