ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు పౌరుల జీవితాల్లో భాగమయ్యాయి. వ్యక్తిగత సంభాషణ, సందేశాల నుంచి సమాచార వినిమయానికి సోషల్ మీడియానే ప్రధాన సాధనం. కానీ మరోవైపు నకిలీ వార్తలు, టెర్రరిజం, మత విద్వేష విచ్ఛిన్నవాదాలు ఈ వేదికలనే వాహికలుగా వినియోగించుకుంటున్న తీరు అనుభవంలోనిదే. ట్విటర్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వేదికలు ప్రపంచ దేశాలన్నింటా విస్తరించి పనిచేస్తున్నప్పుడు స్థానిక చట్టాల పరిధిలోనే పనిచేయాలన్నది కాదనలేనిది. కానీ భావప్రకటనా స్వేచ్ఛ పేరిట బాధ్యతలను మరిచి, స్థానిక చట్టాలకు అతీతంగా వ్యవహరించాలనుకోవటం అనుమతించరానిది.
సామాజిక మాధ్యమాల మార్గదర్శకాలు 2011లోనే జారీ అయ్యాయి. తాజాగా గత నెల 25 నుంచి నూతన నిబంధనావళిని కేంద్రం అమల్లోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి- ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసేందుకు ఓ నోడల్ అధికారిని, నిర్దేశిత నిబంధనలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించటానికి కాంప్లియన్స్ ఆఫీసర్లను మాధ్యమ వేదికలు నియమించాలి. వీరు భారతీయులై ఉండాలి. అలాగే ఏదైనా సమాచారం, సంభాషణ అభ్యంతరకరమైనదని ప్రభుత్వం భావిస్తే, దాన్ని పోస్టు చేసిన వారెవరు, ఎంతమంది ద్వారా వ్యాప్తి చెందిందనే వివరాలన్నీ ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ విషయంలోనే ట్విటర్, వాట్సాప్ లాంటి దిగ్గజ సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తప్పుపడుతూ, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని వాదిస్తున్నాయి. వాట్సాప్ అయితే ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించింది!
భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత లాంటివి అమూర్త విలువలుగా చర్చించటం ఎల్లవేళలా సమర్థనీయం కాబోదు. స్థలకాలాలకతీతంగా ఏ విలువలూ ఉండవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి విదేశీ నిఘా సంస్థలు సామాజిక మాధ్యమాలను వినియోగించాయని స్వయానా ట్రంప్ ఆరోపించారు. నైజీరియాలో ట్విటర్ వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నదని దాన్ని నిలిపేశారు. వాట్సాప్ ఎన్క్రిప్షన్ను సడలించాలని అమెరికా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్ లాంటి దేశాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలు సోషల్ మీడియా పేరుతో ప్రత్యామ్నాయ మీడియాగా ఉన్న వైర్, న్యూస్క్లిక్, ఆల్ట్న్యూస్, స్క్రోల్ ఇన్లను కట్టడి చేయటం కోసమనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో అశ్లీలం, విద్వేషం వంటి చెత్త చాలానే ఉన్నది. వీటిని కట్టడి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు, చట్టాల పరిధి సరిపోదా అన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే ఆందోళనలకు ప్రభుత్వం కూడా తావివ్వకూడదు.