న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా బాధిత ఉద్యోగులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ మహమ్మారి బారినపడి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటామని, వారి పిల్లల చదువు బాధ్యతల్ని తీసుకుంటామని సంస్థ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీలు ప్రకటించారు. ఇందులో భాగంగానే ‘రిలయన్స్ కుటుంబ చేయూత-సంక్షేమ పథకం’ను ప్రారంభించారు. కొవిడ్-19తో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఐదేండ్లపాటు తను చివరగా పొందిన నెలసరి జీతాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. అంతేగాక సదరు ఉద్యోగి పిల్లలు దేశంలోని ఏ విద్యా సంస్థలో చదువుకున్నా బ్యాచ్లర్ డిగ్రీదాకా ట్యూషన్, వసతి, పుస్తకాల ఖర్చులను అందిస్తామని తెలిపారు. అలాగే అప్పటిదాకా ఉద్యోగి భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల కోసం హాస్పిటలైజేషన్ కవరేజీ ప్రీమియం చెల్లింపులనూ పూర్తిగా చేస్తామన్నది. ఇక ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే అది తగ్గేదాకా ప్రత్యేకంగా కొవిడ్ సెలవులను పొందే వీలును కల్పించింది.
జీతం తీసుకోని ముకేశ్
గత ఆర్థిక సంవత్సరం (2020-21) ముకేశ్ అంబానీ జీతం ఏమీ తీసుకోలేదని తాజా వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం నేపథ్యంలో ఆయన స్వచ్చంధంగా తన వేతనాన్ని వదులుకున్నట్లు చెప్పింది. కాగా, అంతకుముందు 11 ఏండ్లు ఏటా రూ.15 కోట్ల జీతాన్ని ముకేశ్ అందుకున్నారు. ఆ మునుపు రూ.24 కోట్లు తీసుకున్నారు.
నిక్లోసమైడ్ కోసం..
కరోనా రోగుల చికిత్స కోసం నిక్లోసమైడ్ వినియోగాన్ని అనుమతించాలని ఔషధ నియంత్రణ మండలికి రిలయన్స్ ఓ ప్రతిపాదన చేసింది. 2003-04లో సార్స్ వ్యాప్తి చెందినప్పుడు నోటి ద్వారా తీసుకునే ఈ యాంటీ వైరల్ డ్రగ్నే వాడారు. అంతేగాక 50 ఏండ్లకుపైగా టేప్వార్మ్ ఇన్ఫెస్టేషన్ (ఓ రకమైన క్రిమికారక వ్యాధి) చికిత్సకూ వినియోగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని కీలక ఔషధాల జాబితాలో ఉంచింది.