హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేసి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయరంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ కాకతీయతో పాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేశామన్నారు.
ప్రగతి భవన్లో శనివారం వ్యవసాయరంగం, విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ మీద సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్సీ , రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బండి కృష్ణమోహన్ రెడ్డి , సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు , వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనీల్ కుమార్, సీడ్స్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు
సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చవాకులు పేలినా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగామన్నారు. తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందన్నారు. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్దితో తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం వల్లనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని సీఎం అన్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయశాఖ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి విత్తనాలు ఫెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు.
తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది.. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుందని సీఎం అన్నారు. నీటికి కట కటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలతో నిండి ఉన్నాయన్నారు. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. వొక్కవానపడితే చెరువులు అలుగులు దునకడానికి సిద్దంగా వున్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్ కు సరిసమానంగా తెలంగాణలో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాల ప్రభుత్వం ఒక్క గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్ట కాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలని సీఎం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తద్వారా నీటిపారుదల రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగం అభివృద్ది పథాన దూసుకుపోవడానికి ముఖ్య కారణాలని సీఎం వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ పటిష్టంగా మారాయన్నారు. కట్టలు తెగకుండా వచ్చిన నీటి బొట్టును వచ్చినట్టే చెరువులు ఒడిసి పట్టుకున్నాయన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం అందించే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ద్వారా బోరు బావులతో పంటలు పండుతున్నాయన్నారు. కృష్ణా, గోదావరి నదుల మీద ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కట్టుకోవడం, కాళేశ్వరం దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, తదితర కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడం వంటి ప్రభుత్వ చర్యల వలన వ్యవసాయరంగంలో తెలంగాణ ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగిందని సీఎం అన్నారు.