హైదరాబాద్: వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్లుగా చేసుకుని తాగవచ్చు. మామిడి తాండ్ర, మామిడి కరేలా లాంటి పదార్థాలు తయారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే, ఈ మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాలను మాత్రం అస్సలు ముట్టుకోవద్దట. మరి ఆ పదార్థాలేమిటో తెలుసుకుందామా..?
నీళ్లు: మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లను అస్సలు తాగొద్దట. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. కడపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
పెరుగు: మామిడి పండు తినగానే పెరుగు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందట. అందువల్ల అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలట. లేదంటే వేడి చేస్తుందట. అంతేగాక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
కాకరకాయ: మామిడి పండ్లు తిన్న తర్వాత కాకరకాయ తీసుకోవడం కూడా మంచిది కాదట. అలా చేయడంవల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయట.
ఘాటైన పదార్థాలు: మామిడి పండ్లు తిన్న తర్వాత ఘాటు పదార్థాలుగానీ, కారం పదార్థాలు గానీ తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట. అంతేగాక ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉన్నదట.
చల్లటి పానీయాలు: మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమట. చల్లటి పానీయాలతో మామిడి పండ్లను తీసుకోవడంవల్ల వాటిలో షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయట.