లక్నో: మనదేశంలో ఇప్పుడు ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటి తయారీ విధానం వేరే. రెండింటిని కలిపి ఇస్తే ఏమవుతుందో అనే విషయంలో స్పష్టత లేదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా యూపీలో అనుకోకుండా మిక్సింగ్ జరిగిపోయింది. సిద్ధార్ధనగర్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 1న మొదటి డోసు కింద కోవిషీల్డ్ ఇచ్చారు. మే 14న రెండో డోసు కోసం వెళ్తే కోవాగ్జిన్ పొడిచారు. సుమారు 20 మందికి ఇలా జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి సమస్యలూ రాలేదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ఇది పొరపాటున జరిగింది. రెండు రకాల టీకాలు కలిపి ఇవ్వమని ఎలాంటి ఆదేశాలు లేవు. ఎంక్వైరీ జరిపి రిపోర్చు తెప్పించాం. బాధ్యుల నుంచి వివరణ కోరాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం అని సిద్ధార్థనగర్ జిల్లా వైద్యాధికారి సందీప్ చౌదరి చెప్పారు. మిశ్రమ టీకాలు తీసుకున్న గ్రామస్థులను కలిసి వాకబు చేశామని కూడా ఆయన చెప్పారు. కానీ ఓ గ్రామస్థుడు మాత్రం తమను ఎవరూ కలవలేదని తెలిపారు. “నాకు ఆందోళనగానూ, భయంగానూ ఉంది. రెండో డోసు కోసం పోతే చూసుకోకుండా వేరే టీకా ఇచ్చారు. అధికారులు ఎవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు” అని రామూ సూరత్ అనే గ్రామస్థుడు చెప్పారు. ఈ 20 మంది ఇంతకూ టీకా తీసుకున్నట్టా లేక తీసుకోనట్టా? అంటే వారికి కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్లో టీకాల కార్యక్రమం అసలే నత్తనడకన నడుస్తున్నది. మరోవైపు ఇలాంటి పొరపాట్లు, గ్రహపాట్లు జరుగుతున్నాయి. యూపీలోని 23 కోట్ల జనాభాలో ఇప్పటివరకు 33 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. జాతీయ సగటు 3 శాతంగానూ, గుజరాత్, కేరళ రాష్ట్రాల సగటు 6 శాతంగానూ ఉంది.