న్యూఢిల్లీ: కొవిడ్-19పై మన పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని, గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరులో మీరంతా కీలకపాత్ర పోషిస్తున్నారని, ఈ పోరాటంలో మీరు ఫీల్డ్ కమాండర్స్ అని అధికారులను ప్రధాని ప్రశంసించారు.
గత ఏడాది మనం వ్యవసాయ రంగంపై నిషేధం విధించలేదని, అయినా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పంట పొలాల్లో సామాజిక దూరం పాటించిన తీరు తనను విస్మయానికి గురించేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అది గ్రామీణ ప్రాంతాల ప్రజల గొప్పతనమని కొనియాడారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో లోకల్ కంటైన్మెంట్ జోన్లు, వేగంగా పరీక్షల నిర్వహణ, ప్రజలకు సరైన, సంపూర్ణ సమాచారం ఇవ్వడం అనేవి మన ప్రధాన ఆయుధాలని ప్రధాని చెప్పారు.
రాష్ట్రాలకు 15 రోజుల ముందే వ్యాక్సినేషన్ షెడ్యూల్
ప్రతిరోజూ సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకోసం కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎంతో కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. రాబోయే 15 రోజుల్లో వ్యాక్సినేషన్కు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్రాలకు ముందస్తుగానే తెలియజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీనివల్ల జిల్లాస్థాయిలో ఎన్ని డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉందో తెలుస్తుందని, దాంతో అందుకు తగినట్లుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం సులభతరం అవుతుందని ప్రధాని పేర్కొన్నారు.
కేసులు తగ్గుతున్నప్పుడే అప్రమత్తత అవసరం
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుతూ వస్తున్నదని, కానీ మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెరుగుతూ పోతున్నదని ప్రధాని చెప్పారు. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పుడే మనం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని ఏమాత్రం ఆశ్రద్ధ చేసినా మహమ్మారి మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు.