నిజామాబాద్ రూరల్, మే 17 : గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు లేకుండా జాబ్ కార్డులు కలిగిన కూలీలందరూ ఉపాధి పనులు చేసేలా వారికి అవగాహన కల్పించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది చొరవ చూపాలని ఈజీఎస్ జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ సూచించారు. రూరల్ మండలంలోని పాల్దా, తిర్మన్పల్లి, జలాల్పూర్ గ్రామాల్లో ఉపాధి పనులను సోమవారం ఎంపీడీవో మల్లేశ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తీవ్రతతో ఈసారి ఉపాధి పనులు చేయడానికి కూలీలు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ లక్షణాలు లేని వారు స్వేచ్ఛగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. అనంతరం నర్సరీలో మొక్కలను పరిశీలించారు. అధికారుల వెంట ఈజీఎస్ టీఏ హరీందర్, సర్పంచులు సుప్రియానవీన్, శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు అర్జున్, శ్రావణ్ ఉన్నారు.