రంజాన్, అక్షయ తృతీయ సందర్భంగా రద్దీ
పెండ్లిళ్ల సందడితో కిటకిటలాడిన దుకాణాలు
ఉదయం 10తర్వాత యథావిధిగా బంద్
సరిహద్దుల వద్ద పటిష్టమైన బందోబస్తు
అనుమతి లేకుంటే నో ఎంట్రీ
మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో మూడోరోజూ లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. రంజాన్, అక్షయ తృతీయతోపాటు పెండ్లిళ్ల సందడి శుక్రవారం స్పష్టంగా కనిపించింది. పెండ్లిళ్ల సందర్భంగా వస్త్ర, కిరాణ దుకాణాలు కిటకిటలాడాయి. బంగారు కొనుగోళ్లు చేసే వారితో జ్యువెల్లరీ షాపుల్లోనూ స్వల్ప రద్దీ కనిపించింది. బసవ జయంతి వేడుకలు కొవిడ్ నిబంధనల మేరకు జరిగాయి. మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాలలు వేశారు. పట్టణంలో లాక్డౌన్ పరిస్థితిని మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షించారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోని ఏపీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే సరిహద్దు దాటేందుకు అవకాశమిచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా వచ్చిన అంబులెన్సులను పుల్లూరు చెక్పోస్టు వద్ద తిప్పిపంపారు. నారాయణపే ట జిల్లా పరిధిలో కర్ణాటకతో ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల వద్ద రాకపోకలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ముసల్దొడ్డి వద్ద కర్ణాటక సరిహద్దుల్లో స్థానికులు రోడ్డుకు అడ్డంగా కంప వేశారు.
కర్ణాటక నుంచి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజోళి మండలం సుంకేసుల ప్రాజెక్టు వద్ద రోడ్డుకు అడ్డంగా కంచె వేసి రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఏపీ నుంచి కర్నూల్, అలంపూర్ టోల్గేట్ మీదుగా పోలీసులు అడ్డుకుంటున్నందున రాజోళి మీదుగా తెలంగాణలోకి ప్రవేశించాలని చూసినా.. పోలీసులు కంచె వేసి పూర్తిగా వాహనాలను రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ ఏర్పాట్లను ఎస్పీ సాయిశేఖర్ పర్యవేక్షించారు. కాగా, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఇండ్లల్లోనే ప్రార్థనలు చేశారు. ప్రధాన మసీదు ల్లో మత పెద్దతో సహా ఐదు మంది ప్రార్థనలు చేశారు. మధ్యా హ్నం తర్వాత వాహనాలు రోడ్లపైకి రాలేదు. దోమలపెంట అంతరాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్టును నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేసి లాక్డౌన్ అమలు, వాహనాల రాకపోకలను పరిశీలించి, సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమలవుతున్న వేళ కర్నూల్, ప్రకాశం జిల్లాల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వచ్చే వాహనదారులపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో భాగంగా అక్కడి నుంచి ఏ ఒక్క వాహనం రాకుండా చూడాలన్నారు. అనుమతితో వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించాలన్నా రు. వనపర్తి జిల్లా కేంద్రంలో రంజాన్ కావడంతో ఉదయం నుం చి 11 గంటల వరకు రద్దీ నెలకొంది. మెయిన్ రోడ్డులోని దుకాణాలు మాత్రం ఉదయం 10:30 గంటలకు బంద్ చేశారు. గల్లీ ల్లో ఉన్న దుకాణాలు మాత్రం యథావిధిగా తెరిచే ఉంటున్నాయి. మధ్యాహ్నం వేళ జనం రోడ్లపైకి రాలేదు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉ న్నాయి. నారాయణపేట జిల్లాలో 10:30 గంటల వరకు దుకాణాలు మూసేశారు. కరోనా, లాక్డౌన్ వల్ల బంగారు వ్యాపారంపై భారీ ప్రభావం పడిందని వ్యాపారులు తెలిపారు.