హైదరాబాద్ : అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్, మార్కెట్ అంత ఈజీగా వదులుకోవడానికి బన్నీ సిద్ధంగా లేడు. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. 80 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక భాగం కాదు రెండు భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నాడు సుకుమార్. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం మొన్నటి వరకు కొరటాల శివ అని వినిపించింది. అయితే ఈ సినిమా అనుకోని కారణాలతో ప్రస్తుతానికి ఆగిపోయింది. మరోవైపు వేణు శ్రీరామ్ తో చేయాల్సిన ఐకాన్ సినిమాపై ఇంతవరకు క్లారిటీ లేదు. అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉన్నాడా లేదా అనే విషయం కూడా సందిగ్దంలో పడిపోయింది.
ఇలాంటి సమయంలో ఆయన తర్వాత సినిమాపై క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా దర్శకుడితో అల్లు అర్జున్ తర్వాత సినిమా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక హిందీ సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడితో బన్నీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆయనెవరో కాదు గౌతమ్ తిన్ననూరి.. జెర్సీ సినిమాతో నేషనల్ వైట్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ దర్శకుడు.. అల్లు అర్జున్ తో ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు గౌతమ్. దీని తర్వాత బన్నీ సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. ఇప్పటికే కథ నచ్చడంతో బౌండేడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా గౌతమ్ కు అల్లు అర్జున్ సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. తమిళం మలయాళం కన్నడ భాషల్లో డబ్బింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.