తాండూరు, మే 7: పట్టణ సమీపంలోని రాజీవ్ కాలనీలోని మాతాశిశు దవాఖానలో కొనసాగుతున్న ఐసోలేషన్ కేంద్రం, కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ సెంటర్లను శుక్రవారం కలెక్టర్ పౌసుమిబసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రత్యేక అధికారి హన్మంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ కరోనా రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వ యంత్రాంగం కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటుందన్నారు. సర్కార్ దవాఖానల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. తాండూరు మాతశిశు దవాఖానలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవల కోసం బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, జనరేటర్తో పాటు పలు సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది శ్రద్ధ చూపాలని సూచించారు. ఇక్కడి ప్రాంత ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా మంచి వైద్యం అందేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. షిప్టులవారీగా వైద్యులు 24 గంటలు సేవలు అందించాలన్నారు.
రాంపూర్ తండాలో..
ధారూరు : మండలంలోని రాంపూర్ తండాలో కార్యదర్శులు, ఆశా వర్కర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఎవరికైన జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే వారిని గుర్తించి కొవిడ్ మందుల కిట్లను అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ఇంటింటి సర్వేకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు,ఆశా వర్కర్లకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో అనిత, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.