టోక్యో ఒలింపిక్స్ దగ్గరవుతున్నాయి. ఈ సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ క్రీడలను రద్దు చేయాలని జపాన్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. ఈ ప్రచారాన్ని ప్రారంభించిన 2 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి ఒలింపిక్స్ క్రీడలను రద్దు చేయాలని కోరారు. ఈ ఆన్లైన్ పిటిషన్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బేక్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిడో సుగా, టోర్నమెంట్కు సంబంధించిన ఇతర సంస్థలు, అధికారులకు పంపించారు.
ఒలింపిక్స్ రద్దు పిటిషన్ను కెంజి ఉట్సునోమియా దాఖలు చేశారు. టోక్యో ప్రభుత్వానికి ఈయన చాలాసార్లు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. మే 17 న ఒలింపిక్ టార్చ్ రిలే ఈవెంట్ నిర్వహించాల్సి ఉన్నది. అదే రోజు థామస్ బాక్ జపాన్ వచ్చి ప్రధానితో సమావేశం కానున్నారు. దీనికి ముందు గరిష్ఠ ప్రచారాన్ని నిర్వహిస్తూ రద్దు కోసం ప్రజల మద్దతు కూడగట్టేందుకు సంతకాలను సేకరిస్తున్నట్లు కెంజి ఉట్సునోమియా తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడం అస్సలు సురక్షితం కాదని పిటిషనర్ కెంజి అభిప్రాయపడ్డారు. జపాన్లోని పలు నగరాల్లో వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్నదని చెప్పారు. ప్రజలు కరోనాతో పోరాడుతున్న పరిస్థితిలో ఈ టోర్నమెంట్ ఆరోగ్య కార్యకర్తలు, పౌరులు, ఆటగాళ్లకు ప్రాణాంతకం అవుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఒక ఏడాదిపాటు వాయిదా పడింది. మొత్తం 11,000 మంది ఆటగాళ్ళు ఒలింపిక్స్లో పాల్గొంటారు. టోక్యోలో ఒలింపిక్స్ వాయిదా వేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఆటలను తొలుత 1940 లో నిర్వహించగా.. చైనాతో యుద్ధం కారణంగా ఆటలు రద్దు చేశారు. ఒలింపిక్స్ 124 సంవత్సరాల చరిత్రలో కేవలం 3 సార్లు రద్దు చేశారు. బెర్లిన్ ఒలింపిక్స్ (1916), టోక్యో (1940), లండన్ గేమ్స్ (1944) రద్దయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఈసారి టోక్యో ఒలింపిక్స్ రద్దయితే దాదాపు 25 బిలియన్ డాలర్లు నష్టం ఉంటుంది.
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..