సంగీతానికి పశుపక్ష్యాదులను స్పందింపజేసే శక్తి ఉందని అంటారు. సరిగమలకు ప్రకృతి కూడా పరవశిస్తుంది. అంతేకాదు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికి మానసిక స్థయిర్యాన్ని అందించడంలోనూ సంగీతం తిరుగులేనిదంటున్నారు కేరళకు చెందిన తారా రాజేంద్రన్. ఆంకాలజిస్ట్గా సేవలందిస్తున్న తారకు భారత శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. తార నానమ్మ విజయలక్ష్మి కలతిల్ క్యాన్సర్తో మరణించారు. ఆమె అవసాన దశలో మంచం పక్కన టేప్రికార్డర్ పెట్టుకుని చిట్టిబాబు సంగీతాన్ని వింటూ సేదతీరేదని, ఆమెకు మానసిక బలాన్నివ్వడంతో సంగీతం సాయపడిందని అంటారు తార. క్యాన్సర్తో పోరాటంలో తన నానమ్మ ఓడిపోయినా ప్రశాంతంగా ఉండేందుకు సంగీతం సాయం చేసిందని ఆమె నమ్ముతున్నారు.
క్యాన్సర్ చికిత్సలో సంగీతాన్నీ ఓ భాగం చేయాలని ‘ఆంకాలజీ స్ట్రింగ్స్’ని ప్రారంభించారు. శాస్త్రీయ సంగీత వాద్యాల్లో ఒకటైన వీణతో ప్రత్యేక స్వరాలను పలికిస్తూ బాధితులకు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రత్యేక రాగాలు రోగుల మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు తార. ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోల ద్వారా ఈ సంగీత చికిత్సను రేడియేషన్కు గురవుతున్న క్యాన్సర్ బాధితులకు అందించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు తార గురువు హార్వర్డ్ మెడికల్ స్కూల్ డీన్, మ్యూజిక్ థెరపిస్ట్, పరిశోధకుడైన డాక్టర్ ఆంథోని. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, కార్నల్ యూనివర్సిటీల్లో మ్యూజిక్ థెరపీ అభ్యసించిన తార మన దేశంలోనూ కీమోథెరపీ తీసుకుంటున్నవారికి ఈ సేవలను అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ప్రస్తుతం అన్నామలై యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆమె దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్థులు, ఆంకాలజిస్టులకు మ్యూజిక్ థెరపీపై అవగాహన కల్పించే ప్రయత్నం
చేస్తున్నారు.