న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అహంకారం, ధనబలం ఓడిపోయాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసి, సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న మమతా బెనర్జీని అభినందించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదిక స్పందించారు. ‘బంగాల్ ఎవరు ఓడిపోయారు?.. అహంకారం, ధనబలం సహా.. జై శ్రీరామ్ను రాజకీయం చేయడం వంటివి ఓటమిని చవిచూశాయి. వీటితో పాటు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడి ఆమె(మమత) నిలిచారు.. చివరకు గెలిచారు’ అని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. ఆయన బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎక్కడా ఆ పార్టీ పేరును ప్రస్తావించలేదు. ఇదిలా ఉండగా.. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో 292 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అధికార టీఎంసీ 213 నియోజకవర్గాల్లో గెలువగా.. బీజేపీ 77 స్థానాల్లో, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.