హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలు.. నేరగాడు నయీంను మించిపోయాయని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి కౌశిక్రెడ్డి ఆరోపించారు. 2004లో 30 ఎకరాలున్న ఈటలకు ఇప్పుడు 200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్చేశారు. ఆయన కోళ్ల ఫారాలలో కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా? అని ప్రశ్నించారు. అసైన్ చట్టం ప్రకారం భూమిని తీసుకోవడానికి వీలులేదని తెలిసీ తీసుకొన్న ఈటలను వెంటనే జైలుకు పంపించాలని ముఖ్యమంత్రిని కోరారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఈటలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించారు. 2004లో ఈటల ఎన్నికల అఫిడవిట్లో ఆయన భార్య జమున పేరు మీద 15 ఎకరాలు, తన పేరు మీద 14 ఎకరాలు ఉన్నట్టు పేర్కొన్నారని, 2018 అఫిడవిట్లో 69 ఎకరాలు చూపించారని తెలిపిన కౌశిక్రెడ్డి.. ఈటల స్వయంగా డిక్లేర్చేసిన దాంట్లో 200 ఎకరాలు చూపకుండా, ఇప్పుడు 200 ఎకరాలున్నాయని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి విచారణ చేయడమంటే అధికారులను ప్రలోభాలకు గురిచేసే అవకాశముంటుందని, అందుకే మంత్రి పదవికి ఈటల రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టర్ అయినా కమలాపూర్ మండలం కందూర్ గ్రామానికి వెళ్లి ఆయన బినామీ సంపత్రావుకు 7% కమీషన్ ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం కమలాపూర్ సింగిల్ విండో చైర్మన్గా ఉన్న సంపత్రావు ఆయన గురువు ఈటల రాజేందర్ బాటలోనే రంగారావు అనే పెద్దాయనను కొట్టి ఆస్తిని తన పేరుమీద రాయాలని బెదిరించారని ఆరోపించారు. ఈటల శిష్యుడు, మాజీ ఎంపీపీ మార్త రమేశ్ సర్వే నంబరు 895లో ప్రభుత్వ భూమి ఎనిమిదెకరాలు కబ్జా చేశారని పేర్కొన్నారు. రూ.500 కోట్లతో భారతీయ మెడికల్ కాలేజీ పెట్టడానికి అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీసీ ముసుగులో ఉన్న ఈటల.. ఐదెకరాల్లో రూ.100 కోట్లు పెట్టి అంత పెద్ద గడీ ఎలా కట్టారో చెప్పాలని నిలదీశారు. ‘ఈటల ముదిరాజ్, ఆయన భార్య రెడ్డి. ప్రేమవివాహం చేసుకున్నారు. కానీ మన తెలంగాణ సంప్రదాయం ప్రకారం తండ్రి ముదిరాజ్ అయితే వారి పిల్లలకు అదే వారసత్వం వస్తుంది. కానీ ఆయన కొడుకు పేరు పాస్పోర్టులో ఈటల నితిన్రెడ్డి, కూతురు పేరు ఈటల నీతారెడ్డి. అది ఆయనే ఒప్పుకున్నారు. మరి ఆయన్ని ముదిరాజ్గా భావించాలా.. లేక రెడ్డిగా భావించాలా?’ అని ప్రశ్నించారు.