టీఆర్ఎస్ 51వ డివిజన్ అభ్యర్థి రంజిత్రావు
డివిజన్లో ఎన్నికల ప్రచారం
భారీ బైక్ ర్యాలీ
ప్రారంభించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
సుబేదారి, ఏప్రిల్ 27 : తనను ఆదరించి, గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని టీఆర్ఎస్ 51వ డివిజన్ అభ్యర్థి బోయినపల్లి రంజిత్రావు అన్నారు. డివిజన్లో ప్రచారం చివరి రోజు మంగళవారం వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, డివిజన్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నక్కలగుట్ట, హౌసింగ్బోర్డు, శ్రీనివాస్కాలనీ, బేతిరెడ్డికాలనీ, సర్క్యూట్ గెస్ట్హౌస్రోడ్డులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రంజిత్రావు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని కోరారు. ఎన్నడూ జరుగని విధంగా ఐదేళ్లలో డివిజన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. అంతర్గ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇంటింటికీ తాగు అందిస్తున్నట్లు చెప్పారు. తాను చేసిన అభివృద్ధినని చూసి మళ్లీ ఓటుతో గెలిపించాలని కోరారు. చీఫ్విప్ వినయ్భాస్కర్, కార్పొరేషన్ అధికారుల సహకారంతో ఇంతకు ముందు డివిజన్ను రూ.20కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నీతి, నిజాయితీతో పనిచేశానన్నారు. ఈ సారి మళ్లీ గెలిస్తే చీఫ్విప్తోపాటు మంత్రి దయాకర్రావు, ప్రభుత్వ పెద్దల సహకారంతో డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా శ్రద్ధ తీసుకుంటామన్నారు. పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో ఆయా కాలనీవాసులనుంచి రంజిత్రావుకు అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో విజయకుమార్, కోన శ్రీకర్, సమ్మయ్య, శ్వేతారెడ్డి, సబితారెడ్డి పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ
చివరి రోజు ఎన్నికల ప్రచారంలో రంజిత్రావు డివిజన్ పార్టీ శ్రేణులు, యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హౌసింగ్ బోర్డుకాలనీ కూడలి వద్ద ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రంజిత్రావుకు ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణచూస్తుంటే భారీ మెజార్టీ ఖాయమన్నారు. ఇంతకు ముందు కార్పొరేటర్గా డివిజన్లో అభివృద్ధి పనులు చేసి, ప్రజల మెప్పు పొందారన్నారు. బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కాలనీలో బైక్ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించారు.
ఇళ్ల ముందు కారు గుర్తుకే ఓటేస్తామని పోస్టర్లు
డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రావుకు ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. కొన్ని ఇళ్ల గోడలకు ఆ ఇంటి యజమానులు కారు గుర్తుకే ఓటేస్తామని స్వచ్ఛందంగా ప్రకటిస్తూ పోస్టర్లు అంటించారు. తమ ఇంటి కుటుంబ సభ్యులందరూ కారు గుర్తుకే ఓటేస్తామని, కరోనా నేపథ్యంలో దయచేసి ఇబ్బంది పెట్టకండి అని పోస్టర్లు రాసి ఇంటి మందు అంటించారు. ఇలా పోస్టర్లు అంటించడం డివిజన్లో ఆసక్తికరంగా మారింది.