రుణాల లక్ష్యం..రూ.600 కోట్లు
మహిళా సంఘాల బలోపేతానికి సర్కారు చర్యలు
బ్యాంకు లింకేజీతో రూ.500 కోట్లు, స్త్రీనిధి కింద రూ.100 కోట్లు
ప్రతి ఏటా రుణాలను పెంచుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 నుంచి రూ.10 లక్షలు
జిల్లావ్యాప్తంగా 19,500 స్వయం సహాయక సంఘాలు, 2,19,340 మంది సభ్యులు
రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ):మహిళల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకం నుంచి రూ.600 కోట్ల రుణాల మంజూరే లక్ష్యంగా అధికారులు నిర్దేశించారు. బ్యాంకు లింకేజీతో రూ.500 కోట్లు, స్త్రీనిధి కింద రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయనున్నారు. ప్రతి ఏటా రుణాలను పెంచుతుండడంతో మహిళలు చిరువ్యాపారాలతో పాటు బర్రెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 నుంచి రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 19,500 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 2,19,340 మంది సభ్యులు ఉన్నారు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తూ వస్తుంది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణ దుకాణాలను నిర్వహించేందుకు, గేదెలను, గొర్రెలను, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయాల వ్యాపారం చేసుకునేందుకుగాను రుణాలను తీసుకుంటున్నారు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు మంజూరు చేయాలనే లక్ష్యాన్ని రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నారు. జిల్లాలో 99 శాతం స్వయం సహాయక సంఘాలు రుణాలు పొంది క్రమం తప్పకుండా చెల్లిస్తుండగా.. కేవలం 500 ఎస్హెచ్జీలు మాత్రమే పనిచేయని సంఘాలున్నట్లు డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అయితే ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందడంలో చేయూతనందిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.600 కోట్లు…
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు స్త్రీనిధి రుణాలకు సంబంధించి రూ.600 కోట్లు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బ్యాంకు లింకేజీ కింద రూ.500 కోట్లు, స్త్రీనిధి కింద రూ.100 కోట్లు రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. గతేడాది బ్యాంకు లింకేజీ కింద రూ.480 కోట్లు, స్త్రీనిధి పథకం కింద రూ.60 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.40 కోట్లు అదనంగా పెంచినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19,500 స్వయం సహాయక సంఘాలుండగా 2,19,340 మంది సభ్యులున్నారు. వీరిలో 2752 స్వయం సహాయక సంఘాలు కొత్తగా ఏర్పాటుకాగా 29,450 మంది సభ్యులున్నారు.
గతేడాది రూ.543 కోట్లు రుణాలు మంజూరు…
గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి పథకం ద్వారా రూ.540 కోట్లు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.543 కోట్లు రుణాలను మంజూరు చేశారు. గతేడాది బ్యాంకు లింకేజీ కింద ఆయా నియోజకవర్గాల్లోని స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి.. చేవెళ్ల నియోజకవర్గంలో రూ.107.40 కోట్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.111.67 కోట్లు, షాద్నగర్ నియోజకవర్గంలో రూ.102.76 కోట్లు, మహేశ్వరం నియోజకవర్గంలో రూ.60.22 కోట్లు, కల్వకుర్తి నియోజకవర్గంలో రూ.77.47 కోట్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రూ.25.96 కోట్లు రుణాలను మంజూరు చేశారు.