వేములవాడ టౌన్, ఏప్రిల్ 20 : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తామని, కొవిడ్ నేపథ్యంలో ఆలయంలో ఆంతరంగికంగానే వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి త్రిరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం యాగశాలలో ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో హవనం నిర్వహించారు. యాగశాలలో ఆచార్య దంపతులు మరంగంటి గిరిధరాచార్యులు-మాధవి దంపతులు పూజలు నిర్వహించి హవనం చేశారు. శ్రీరామనవమి నవరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారు, శ్రీ లక్ష్మీసమేత అనంతపద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులను నంది గరత్మంతుని వాహనంపై ఆలయంలో విహరింపజేశారు. ప్రధానార్చకులు ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉత్సవమూర్తులకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు రాజశేఖర్, పూజల ఇన్చార్జి రవీందర్రెడ్డి, గట్టు గౌతమ్ పాల్గొన్నారు.
కొండగట్టులో..
మల్యాల, ఏప్రిల్ 20 : కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో నేడు శ్రీరామనవమిని సందర్భంగా అర్చకులతో ఆంతరంగికంగానే సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు.