కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ 48 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ 14,300 కన్నా తగ్గింది. దీంతో రోజుల వ్యవధిలోనే రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ర్టాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుండటంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోనున్నదన్న ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మార్చినెల చివరిదాకా జీడీపీల పరుగు, 50వేలు దాటిన సెన్సెక్స్ అంగలు చూపి వృద్ధికి ఢోకాలేదని చెప్పుకొచ్చిన కేంద్రప్రభుత్వం, తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. గత ఏడాది కరోనా లాక్డౌన్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తాజా పరిస్థితి ఆశనిపాతమే.
ప్రభుత్వాలు గత అనుభవాల దృష్ట్యా తొందరపడో, గాబరాపడో లాక్డౌన్ దిశగా ఆలోచించటం లేదు. కానీ ఇప్పుడు వైరస్ ఉధృతితో పర్యాటకం, ఆతిథ్యం, రెస్టారెంట్, విమానయానం, వినోద, వాహన, నిర్మాణ రంగాలు ప్రతిష్టంభనకు గురవుతున్నాయి. ఇంగ్లండ్ ఇతర పాశ్చాత్య దేశాలు భారతీయ విమానాలపై నిషేధం విధించాయి. వాణిజ్య, రవాణా రంగాలు స్తంభించిపోతున్నాయి. కొన్నేండ్లుగా ప్రచారమైన ఆర్థిక వృద్ధి రేటంతా అంకెల గారడీయేనని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత స్థితి మరింత సంకటంగా పరిణమించింది.
వైరస్ విలయతాండవంతో ప్రజాజీవితాలు అల్లకల్లోలం కానున్నాయి. పోయిన ఏడాది సరిగ్గా ఇదే కాలంలో అల్పాదాయ వర్గాలు, కార్మికులు, దినకూలీలు, వలసకూలీలు మొదలుకొని దిగువ మధ్యతరగతి వర్గాల వరకు అనేకమంది వెతలను చవిచూశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొనకుండా కేంద్రం డబ్బు చెలామణిని పెంచాలి. అవకాశమున్న వారందరికీ వడ్డీలేని రుణాలివ్వాలి. ఉపాధి కోల్పోతున్నవారందరినీ ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలి. నగరాల్లో ఉపాధి కోల్పోవటం వల్ల గ్రామాల్లో 41.75శాతం ఉపాధి హామీ కూలీలు పెరిగారు. ఇలాంటివారు 11.17కోట్లు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. ఉపాధి హామీ పథకం పూర్తిగా రాష్ర్టాల పరిధిలో ఉన్నా నిధులు సమకూర్చాల్సిందే కేంద్రమే. ఉపాధి హామీ పనుల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే ఆదర్శంగా ఉన్నది. పరిస్థితులకు కుంగిపోయి చేష్టలుడిగి చూడకుండా, ప్రజల జీవన ప్రమాణాలను పరిరక్షించటం ఎలా అన్నదానిపై దృష్టిపెట్టడం ఇప్పటి అవసరం. ఉపాధిని, సాయాన్ని పెంచటం ద్వారా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.