సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 13 : పంచభూతాల్లో ఒకటి నిప్పు.. మనిషి జీవితం అగ్నితో ముడిపడి ఉంది. ఎంత ఉపయోగపడుతుందో.. నిర్లక్ష్యం.. అజాగ్రత్తగా ఉంటే జీవితాలు బుగ్గిపాలవుతాయి. తరుచూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందనే మాట వింటాం. ప్రమాదం జరిగిన సమయంలో అవగాహన లేకపోవడం మూలంగా ఆస్తినష్టంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరుగుతున్నది. ఈ నివారణకు ప్రతి సంవత్సరం అగ్నిమాపక శాఖ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బుధవారం నుంచి వా రోత్సవాలు ప్రారంభవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
అమరులను స్మరిస్తూ వారోత్సవాలు
ముంబై విక్టోరియా డాక్యార్డులో 1944 ఏప్రిల్ 14న ఒక నౌకకు అగ్ని ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆ దళ సిబ్బంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలను ఆ శాఖ నిర్వహిస్తుంది. కర్తవ్య నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. నాటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగిస్తున్నారు.
వారం రోజుల్లో వివిధ రూపాల్లో అవగాహన
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్నిమాపక శాఖ వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తుంది. కరపత్రాలు పంచుతూ గోడపత్రికలను ఆయా ప్రధాన చౌరస్తాల్లో అంటించి చైతన్యపరుస్తుంది. సినిమా టాకీసులు, దవాఖానల్లో ప్రమాదం జరిగినప్పుడు చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలో ప్రయోగాత్మకంగా చేసి చూపుతూ అవగాహన కల్పిస్తుంది. కళాశాలలు, విద్యాలయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు మ్యాక్ డ్రిల్ చేపడుతుంది. స్లమ్ ఏరియాలతో పాటు వివిధ కాలనీలలో మహిళలకు వంట చేసేటప్పుడు, విద్యుత్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. పారిశ్రామిక వాడ, గోదాములు, గిడ్డంగులలోనూ ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతారు. చివరి రోజున అగ్నిమాపక శాఖ కేంద్రంలో పరికరాల వినియోగం, ఫొటో గ్యాలరీతో అగ్నిమాపక వారోత్సవాలు ముగుస్తాయి.