మద్యం మత్తులో ఓ చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తి చేసిన తప్పిదం కలకలం సృష్టించింది. బాలిక కిడ్నాప్ అయ్యిందన్న సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు రాత్రంతా ఉరుకులు పరుగులు పెట్టారు. మిస్టరీని ఛేదించేందుకు బృందాలుగా విడిపోయి రాత్రంతా పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. చివరకి కిడ్నాప్ అయిన బాలిక బస్టాండ్లో నిద్రపోతూ కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. హయత్నగర్ పీఎస్ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్కే నగర్కు చెందిన బారానాదాసు చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తాడు. మద్యం మత్తులో ఉన్న బారానాదాసు సోమవారం మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే బాలికను కిరాణా షాపునకు తీసుకువెళ్లాడు. అక్కడ కేక్ ఇప్పిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆటోలో ఎక్కించుకుని సినిమాకు తీసుకెళ్లాడు.
రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చే సమయంలో లెక్చరర్స్ కాలనీ వద్ద బాలికను వదిలేయగా.. బాలిక అక్కడే నిద్రపోయింది. మధ్యాహ్నం వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో సాయంత్రం 7 గంటల సమయంలో తల్లిదండ్రులు తమ కుమార్తె కిడ్నాప్ అయ్యిందని ఫిర్యాదు చేయడంతో హయత్నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆరు బృందాలుగా విడిపోయి రైల్వే, బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. చివరికి ఓ కెమెరాలో బారానాదాసుతో బాలిక కనిపించడంతో అతడే కిడ్నాప్ చేశాడని భావించిన పోలీసులు ఆ వైపు దృష్టి సారించారు. అంతలోనే మంగళవారం తెల్లవారు జామున లెక్చరర్స్ కాలనీలోని బస్టాండ్లో బాలిక పడుకొని ఉండగా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ తతంగమంతా ఏడు గంటల పాటు సాగింది. మంగళవారం బారానాదాసును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.