చెన్నై : తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్ సహా పలువురు ఆ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారని ఏఐఏడీఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయాలని కోరింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న డీఎంకే అగ్రనేతలు స్టాలిన్, ఉదయనిథి స్టాలిన్, ఈవీ వేలు, కేఎన్ నెహ్రూ, దురై మురుగన్లను అనర్హులుగా ప్రకటించాలని ఏఐఏడీఎంకే ఈసీకి రాసిన లేఖలో డిమాండ్ చేసింది.
ఇక స్టాలిన్కు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఓట్లు వేయించాలని కోరుతూ ఆయన భార్య దుర్గా స్టాలిన్ నియోజకవర్గంలో మకాం వేసి సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ పదివేలు చొప్పున పంచారని ఏఐఏడీఎంకే నేత మురుగవేల్ ఈసీకి రాసిన లేఖలో ఆరోపించారు. మరోవైపు ఏఐఏడీఎంకే ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధిస్తుందనే భయంతో తమ పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేశారని ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ కనిమొళి సోము అన్నారు. ఇక తమిళనాడులో ఇప్పటివరకూ రూ 428 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.