జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 18,998 ఎకరాల్లో సాగవుతున్న పండ్ల తోటలు, కూరగాయల సాగు
166 రెవెన్యూ గ్రామాల్లో ఊసేలేని ఉద్యాన పంటల సాగు
ప్రతి మండలంలో అదనంగా 50 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేసేలా జిల్లా ఉద్యానశాఖ కసరత్తు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘గతంలో మూస పద్ధతిలో సాగిన వ్యవసాయానికి స్వస్తి పలికి.. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్తిగా విస్మరణకు గురైన ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చేలా ముందుకు సాగుతోంది. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా ఉద్యానవన శాఖ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం జిల్లాలోని 17 మండలాల పరిధిలో 18,998.49 ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటలు సాగవుతుండగా.. సాగు విస్తీర్ణాన్ని మరో 19,320 ఎకరాలకు పెంచే దిశగా సంబంధిత అధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. ఉద్యమంలా సాగనున్న ఉద్యానవన సాగుతో జిల్లాలో రాబోవు రోజుల్లో పండ్లు, కూరగాయల కొరత తీరనున్నది.’
జిల్లా జనాభాకు తగ్గట్టు కూరగాయల సాగు జరగడం లేదు. ఒకటీ రెండు మండలాల్లో భారీగానే కూరగాయలను సాగు చేస్తున్నప్పటికీ కూరగాయల కొరత వెంటాడుతున్నది. జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా, అందులో 15వేల ఎకరాల్లోపు పండ్ల తోటలు, 3వేల ఎకరాల లోపునే కూరగాయలు పండుతున్నాయి. నేటి వరకు 166 రెవెన్యూ గ్రామాల్లో రైతులు ఉద్యాన పంటలనే సాగు చేయడంలేదని జిల్లా ఉద్యానవన శాఖ చెబుతున్నది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టడీ ప్రకారం..ఒక వ్యక్తి రోజుకు 325 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాల్సి ఉం టుంది. కనీసం 200 గ్రాములు తీసుకున్నా.. జిల్లా జనాభాకు తగ్గట్టు ఏడాదికి 67,881 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. అయితే ప్రస్తుతం ఏడాదికి 40,139 మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. చాలా వరకు కూ రగాయలు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నవేనని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. కొరతను గట్టెక్కించాలంటే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని 19వేల ఎకరాలకు, పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని మరో 18వేల ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యానవన శాఖ చెబుతున్నది.
మండలానికి 50 ఎకరాల సాగు పెంచేలా కార్యాచరణ
సాధారణంగా జిల్లాలో అక్టోబర్ నుంచి మార్చి వరకు కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుండగా, ఆ సమయంలోనూ 50శాతం కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలంలో.. అన్ సీజన్లో దిగుమతి 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే జిల్లాలో కూరగాయల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు మూసీ, గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా బోరు బావుల్లో సైతం నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండిస్తే లాభాలు గడించవచ్చని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి కొత్తకొత్త పద్ధతుల్లో సాగు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. జిల్లాలో గతంలో సాగు చేసిన దానికంటే మండలానికి 50 ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగును చేపట్టాలని ఉద్యానవన శాఖ ప్రణాళికలను రూపొందించి రైతులను చైతన్యపర్చే పనిలో నిమగ్నమైంది. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచి, అన్ని రకాల కూరగాయలను ఇక్కడే పండించడం వల్ల జిల్లా ప్రజలకు తక్కువ ధరకే అందించగలుగుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తద్వారా రైతులు కూడా లాభపడవచ్చని చెబుతున్నారు.
ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం
ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల సాగు కు యోగ్యమైన భూ ములు చాలా వరకు జిల్లాలో ఉన్నాయి. గతంతో పోలిస్తే నీటి లభ్యత కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో గతంలో సాగు చేసిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను సాగు చేసేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. ఇప్పటికే చాలా మంది రైతులు ఉద్యాన పంటల సాగు పెంపు దిశగా ఉపక్రమించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే అవకాశం రైతులకు కలుగడంతోపాటు తక్కువ ధరకే నాణ్యత గల పండ్లు, కూరగాయలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
ఇవి కూడా చదవండి
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా