చర్చిల్లో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు
ఏసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని తెలిపిన పాస్టర్లు
ప్రత్యేక గీతాలతో ఆరాధన కార్యక్రమాలు
మెదక్ చర్చిలో తెల్లవారుజామునే ప్రారంభమైన ప్రార్థనలు
పలుచోట్ల వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 4: ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహా దేవాలయం(చర్చి)లో ఆదివారం తెల్లవారు జామున 4.30గంటల నుంచి వేడుకలు కనులపండువగా ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేస య్య లేచి వచ్చాడని ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోతారు. త్వరలో ఈ లోకానికి వస్తా.. అప్పటి వరకు నేనున్నానని తెలియజేయండి అని వెళ్లిపోతాడు. దీనినే క్రైస్తవులు ఈస్టర్ (పునరుత్థాన) పండుగగా జరుపుకుంటారు. ఈస్టర్ను పురస్కరించుకుని భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం రోజు నుంచే రావడంతో వసతిగృహాలు దొరక్కపోవడంతో ఆరుబయటే ఉండిపోయారు.
సిలువ ఊరేగింపుతో ప్రారంభమైన వేడుకలు…
మెదక్ చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగున్నర గంటలకు సిలువ ఉరేగింపుతో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సిలువకు మహిళలు భక్తులు పెద్దఎత్తున కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవం, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి గురువుల భక్తి సూక్తుల మధ్య భక్తి గీతాలు ఆలపించారు. యేసు సమాధి నుంచి లేచి వచ్చిన సందేశాలతో భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కొంతమంది క్రైస్తవులు తమ ఆప్తుల సమాధుల వద్ద ఆదివారం తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు
మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు యేస య్య అని మెదక్ బిషప్ రెవరెండ్ సాలోమాన్రాజ్ అన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఉద యం 4.30గంటలకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశం చేశారు. పాపుల రక్షణ కోసం సిలువలో మరణం పొంది తిరిగి లేచి పరలోకానికి దారి చూపిన దేవుడు, శిలువ వెలుగులో రక్షణనిస్తున్న దేవు డు యేసయ్య అన్నారు. ప్రేమ, కరుణ, దయ త్యాగం, సేవ, పాప క్షమాపణలకు ప్రతి రూపం యేసు ప్రభువేనన్నారు. భక్తులందరికీ క్రీస్తు యేసు నామమున శుభములు కలుగాలన్నారు. అంతకుముందు చర్చి ప్రేసిబేటరీ ఇన్చార్జి ప్రేమ్సుకుమార్ దైవసందేశం చేశారు. ఈ వేడుకల్లో బిషపమ్మ వజ్రమణి సంతోషి, చర్చి అసిస్టెంట్ ప్రేసిబేటరీ ఇన్చార్జి రాజశేఖర్, పాస్టర్లు అనుగ్రహ, జైపాల్, సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలండ్పాల్, సువన్డగ్లస్, జయరాజ్, శాంతికుమార్, సంసన్ సందీప్, గెలన్ పాల్గొన్నారు.