రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడండి
ఎస్సారెస్పీ నీటితో మున్నేరు వాగు చెక్డ్యాంలు నింపండి
అధికారులతో సమావేశంలోమంత్రి సత్యవతి రాథోడ్
మొగిలిచర్ల వద్ద కాల్వ నీటికి పూజలు
మహబూబాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పకడ్బందీగా ధాన్యం కొనగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందేలా చూడాలన్నారు. మున్నేరు వాగులోకి ఎస్సారెస్పీ నీరు తీసుకొచ్చి చెక్డ్యాంలు నింపాలని సూచించారు. తాళ్లపూసపల్లి నుంచి ఈదుల పూసలపల్లి మీదుగా మహబూబాబాద్లోని మున్నేరు వాగులోకి నీరుతెచ్చి గార్ల, బయ్యారం మండలాల్లోని భూములకు సాగునీరు అందించాలని సూచించారు. కొవిడ్ మళ్లీ వి జృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరైందని, మరిన్ని నిధులు కావాలని మంత్రి నిరంజన్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. మహబూబాబాద్ పట్టణ అవసరాలు తీర్చే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్..
కురవి : తెలంగాణ రైతాంగాన్ని కాపాడే అపర భగీరధుడు సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని మొగిలిచర్ల గ్రామం వద్ద ఎస్సీరెస్పీ కాల్వ నీటికి పూజలు నిర్వహించారు. సొంత ఊరు గుండ్రాతిమడుగుకు ఎస్సీరెస్పీ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు తెచ్చేందుకు ప్రయత్నించానని, సీఎం కేసీఆర్ దయతో కాళేశ్వరం నీటిని రైతాంగానికి అందించడం వరమన్నారు. రైల్వే ట్రాక్కు అవతలి వైపు ఉండే గ్రామాల తాగునీటి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్ఈ వెంకటేశ్వర్లు, సుదర్శన్, డీఈలు పొట్టయ్య, భద్రునాయక్, వినయ్, ఏఈలు సామ్రాజ్, రోహిత, హార్థిక, టీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, గుగులోత్ శ్రీరాంనాయక్, శ్రీధర్రెడ్డి, శ్రీను, గుగులోత్ నెహ్రూ, అల్లూరి కిశోర్ వర్మ, లింగు సమ్మయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ప్యాకింగ్ కవర్ల పొరలలో బంగారం రేకులు