ఖర్చు రూ.62,340.. సర్కారు సబ్సిడీ రూ.30 వేలు..
120 మంది.. 297 ఎకరాల్లో తోటల పెంపకం..
అంతర పంటలు వేసుకొని లాభం పొందే అవకాశం
ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్కు ఏర్పాట్లు ముమ్మరం
విప్ బాల్క సుమన్ చొరవతో ముందుకొస్తున్న రైతులు
మంచిర్యాల, మార్చి 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కారు సంప్రదాయ సాగుకు స్వస్తి పలకాలని సూచిస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న విభిన్న రకాల పంటలు వేయాలని, ఉద్యాన పంటల వైపు మళ్లాలని ప్రచారం చేస్తున్నది. పల్లెపల్లెనా రైతులకు ఆయిల్ పామ్పై దృష్టిసారించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఒకేసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్లు రాబడి వస్తుండడం, సర్కారు కూడాసబ్సిడీపై రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుండడం, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతుండడం, విప్ బాల్క సుమన్ ప్రత్యేక ప్రోద్భలంతో రైతులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే చెన్నూర్ నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలోని 36 గ్రామాల్లో 120 మంది రైతులు 197 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకం అనుకూలతపై కేంద్ర సంస్థల అధికారులు సర్వే నిర్వహించారు. 18 మండలాలకు 15 మండలాల్లో అనువైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు. 2020-21 సంవత్సరానికిగాను పైలెట్ ప్రాజెక్టు కింద చెన్నూర్ నియోజకవర్గానికి 400 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో తోటల పెంపకానికి 407.32 ఎకరాలకు 152 మంది రైతులను గుర్తించి కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. బిందు సేద్య పథకంలో భాగంగా 168.33 ఎకరాల్లో 54 మంది రైతులకు అనుమతులు ఇవ్వగా.. మిగతా 231.07 ఎకరాల్లో వాటా చెల్లించే వారికి కూడా అనుమతులు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మొక్కల పెంపకం కోసం తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థకు డీడీలు తీయగా, ఇప్పటి వరకు 120 మంది రైతులకు అందజేశారు. వాటిని రైతులు 297 ఎకరాల్లో నాటారు. మరో 110 ఎకరాల్లో నాటాల్సి ఉంది.
ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో జైపూర్ ఉద్యాన నర్సరీలో 2 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం మానిటరింగ్ బాధ్యతలు ఆయిల్ ఫెడ్ సంస్థ నుంచి మ్యాట్రిక్స్ కంపెనీకి మారడంతో మొక్కల పెంపకానికి సదరు సంస్థ భీమారం మండల కేంద్రానికి సమీపంలో స్థలం కొనుగోలు చేసింది. నర్సరీ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ, రాయితీలతో పాటు విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ప్రత్యేక చొరవతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చారు. కాగా.. మంత్రులు నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్.. ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయిల్ పామ్ తోటల సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో ఆయిల్ పామ్పై అవగాహన కోసం విప్ సుమన్ 3 వేల మంది రైతులను 60 బస్సుల్లో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట క్షేత్రపరిశీలనకు తీసుకెళ్లారు. అనంతరం జిల్లాకు వచ్చిన రైతులు జిల్లాలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రిమండలాల పరిధిలో గల 36 గ్రామాల్లో సాగు చేస్తున్నారు.
త్వరలో కంపెనీ ఏర్పాటుకు కసరత్తు
ఆయిల్ పామ్ సాగు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయడంతో పాటు ప్రాసెసింగ్ కోసం కంపెనీలను ఎంపిక చేసింది. ఆయిల్ పామ్ తోటలను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థను జిల్లాలో మ్యాట్రిక్స్ సెక్యూరిటీ సర్వైలెన్సెస్, శ్రీ శ్రీనివాస పామాయిల్ మిల్, మంచిర్యాల కంపెనీకి అప్పగించారు. మానిటరింగ్ బాధ్యతలను మ్యాట్రిక్స్ కంపెనీకి ఇచ్చినా రైతులకు అందే సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ సబ్సిడీ, ప్రోత్సా హకాలు, ఉద్యావన శాఖ అధికారుల సలహాలు, సూచనలు యథా విధిగా కొనసాగుతాయి. ఇప్పటి వరకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జిల్లా యూనిట్ సేవలు ఇక నుంచి మ్యాట్రిక్ సంస్థ ద్వారా అందనున్నాయి. ఈ కంపెనీ మొక్కలు సరఫరా చేసేందుకు నర్సరీ కోసం భీమారం మండ లంలో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ జిల్లా ప్రతినిధి ఉదయ్కుమార్ తెలిపారు. ఇందులో ఆయిల్ పామ్ మొలక లు పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. కోస్టారికాతోపాటు ఇతర దేశాల నుంచి కూడా మే – జూన్ వరకు ఆయిల్ పామ్ మొలకలు తెప్పించనున్న ట్లు, వచ్చే నెలలో నర్సరీ పనులు ఏర్పాట్లు కూడా పూర్తి కానున్నట్లు వివరించారు. త్వరలోనే నియోజక వర్గం లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూని ట్ను నెలకొ ల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మొక్కల దిగుమతికి కొవిడ్ ఎఫెక్ట్..
కరోనా ప్రభావం ఆయిల్ పామ్ సాగుపైనా పడింది. ఆయిల్ పామ్ మొలకలు సాధారణంగా దక్షిణ అమెరికాలోని కోస్టారికా నుంచి దిగుమతి అవుతుంటాయి. సదరు మొలకలను జిల్లాలో ఏడాదిపా టు పెంచి, అనంతరం రైతులకు అందజేస్తారు. వారు తమ పంట క్షేత్రాల్లో సాగు చేస్తుంటారు. గతేడాది మార్చి నుంచి కొవిడ్-19 ఎఫెక్ట్తో విదేశాల నుంచి రాకపోకలు సాగకపోవడంతోపాటు రవాణా నిలిచింది. లాక్డౌన్ ప్రభావం మొక్కల సరఫరా మీద పడడంతో రైతులకు అధికారులు సకాలంలో అందజేయలేకపోయారు. దీంతో కొంత కాలం ఇబ్బంది అయినా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రెండు లక్షల మొక్కలను తెచ్చి జైపూర్ నర్సరీలో పెంచుతున్నారు. మొలకలు 1-12 మీటర్ల ఎత్తు, 20-25 సెంటీ మీటర్ల కాండం చుట్టు కొలత పెరిగిన తర్వాత రైతులకు ఇస్తారు.
ఒకసారి పెట్టుబడి..30 ఏండ్లు ఆదాయం..
ఆయిల్ పామ్ సాగుతో రైతులు తక్కువ పెట్టుబ డితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఎకరానికి నికరంగా రూ.లక్ష ఆదాయం వస్తుంది. మనదే శం ఏటా సుమారు రూ.70 వేల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. దిగుమతులను తగ్గిం చేందుకు దేశంలోనే పంట ను కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో లక్ష్యాన్ని పూర్తి చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిం చింది. రైతుకు ఎకరంలో ఆయిల్ పామ్ సాగుకు రూ.62,340 ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వమే రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక రైతు కేవలం రూ.32,340 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా బ్యాంకుల ద్వారా రుణం అందించనుంది. ఈ రుణాన్ని కూడా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా.. నాలుగేళ్లపాటు మారటోరియం విధించేలా బ్యాంకులను ఒప్పించింది. నాలుగేం డ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో రుణాలు చెల్లించవచ్చు. ఈ పంట ఒకసారి వేస్తే 30 ఏండ్లు ఆదాయం వస్తుంది. నాలుగేండ్లలోనూ అంతర పంటలు వేసుకోవడంతో లాభం చేకూరుతుంది. డ్రిప్ సిస్టంతో నీటి ఆదా అవుతుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.