హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఇకపై మన శాసనసభ పేపర్ లెస్ కానున్నది. అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలన్నీ శాసనసభ్యులకు ఇకనుంచి ఆన్లైన్ ద్వారా పంపనున్నారు. ఇందుకోసం గురువారం సభ్యులందరికీ యాపిల్ ఐప్యాడ్లు అందజేశారు. ఇన్నిరోజులూ కాగితాలు, పుస్తకాల రూపంలో సభ్యులకు సమాచారం ఇచ్చేవారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఇదివరకే కార్యాలయాలన్నీ ఈ- ఆఫీసుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా శాసనసభ్యులకు కూడా ఐప్యాడ్లు అందించి వారికి ఇవ్వాల్సిన సమస్త సమాచారాన్ని, అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలను ఆన్లైన్ ద్వారానే చేరవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనసభ ప్రొసీడింగ్లను, ఇతర ఉత్తర, ప్రత్యుత్తరాలకు ఇక ఆన్లైన్ను వేదికగా చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సమయం బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా హరీశ్రావు నిలిచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గురువారం హరీశ్రావు చేసిన 96 నిమిషాల బడ్జెట్ ప్రసంగమే సుదీర్ఘమైనది. ఈ సారి బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులను డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగాన్ని పుస్తక రూపంలో ముద్రించినప్పటికీ శాఖలకు కేటాయించిన వివరాలను, సోషియో ఎకానమిక్ సర్వే తదితర అంశాలను పూర్తిగా పెన్ డ్రైవ్లో సభ్యులకు అందించారు. కరోనా దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగం సమయంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్టు ప్రకటించడంతో సభ్యులు బల్లులు చరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. చాలా సేపు చప్పట్లతో సభ మారుమోగింది.