కటిక మనసు నీదోయీ!/ కరుణ ఏల లేదోయీ/ మతము పేరుతో మానవజాతిని/ హతము సేయుటే మతాదర్శమా? మానవ సభ్యత మానవ సంస్కృతి/ మంటగలుపుటే మతాదర్శమా..? అని ధవళా శ్రీనివాసరావు అనే కవి 1946లోనే మత విద్వేషాన్ని ఈసడించుకున్నాడు. శాంతియుత సహజీవనం, పరమత సహనం పునాదిగా సాగిన స్వాతంత్య్రోద్యమ విలువలను కొందరు దిగజారుస్తున్నారు. మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్ది, ధర్మవర్తనకు దారిచూపిన మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం విషగుళికగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మతాల మధ్య అగాధాలు సృష్టించి రాజకీయ సోపానాలు నిర్మించుకునే నికృష్టానికి పాల్పడుతున్నారు. మతాల మంటలు రేపి చలిగాచుకునే వికృత క్రీడకు తాజా ఉదాహరణ నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటన.
అన్ని జంతువులు ఆహారంకోసం చంపుతాయి. కానీ ఒక్క జంతువు మాత్రమే వినోదం కోసం, విద్వేషంతో పగకోసం చంపుతుంది. ఆ జంతువు పేరే మనిషి- అని మార్క్ట్వేన్ అంటాడు. సరిగ్గా ఇలాంటి విద్వేషకారులే భైంసాలో ఘర్షణలను ఎగదోశారు. ఇద్దరు యువకుల మధ్య చిన్న తగాదాను కార్చిచ్చులా రాజేయటానికి ప్రయత్నించారు.
ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దినా, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఇల్లెక్కి గోల చేస్తున్నారు. ఉన్నతాధికారుల అంతుచూస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇది వారి రాజకీయ నిస్సహాయ స్థితిలోంచి వచ్చిన అసహనంగా చెప్పక తప్పదు. గత కొంతకాలంగా ఈ శక్తులు రాజకీయ ప్రాబల్యం కోసం ఆరాటపడుతూ, ఎంతకైనా దిగజారుతుండటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మతవిద్వేషాల్లో చనిపోయేది ఎవరైనా మనిషే. మంటగలిసేది మానవతే. ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు? అన్న మహాకవి దాశరథి చూపిన మార్గం తెలంగాణకు ఆదర్శం. ఆ వెలుగులోనే రాష్ట్రంలో సాగిన మత ఘర్షణలు తెలంగాణ వచ్చాక గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. రాష్ట్రసాధన కోసం సబ్బండవర్ణాలు సుదీర్ఘకాలం కలిసి చేసిన ఉద్యమం కుల, మత, వర్గాలకు అతీతంగా, మున్నెన్నడూ లేనివిధంగా, ఐక్యత, సఖ్యత సాధించింది. దీంతో మతవిద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకునేవారి పునాదులు కదిలిపోయాయి. మతవిద్వేషకుల ఉనికే ప్రశ్నార్థకమైంది. తెలంగాణ సాధించిన విజయాల్లో మకుటాయమానమైనది ఇదే. పోరాటాలకూ, చైతన్యానికీ ప్రతీక అయిన తెలంగాణ ఎలాంటి విచ్ఛిన్నశక్తుల ఆటలను సాగనివ్వదు.