మౌనిక పాట నేర్చింది. ఆ పాట.. సామాజికమై సరిహద్దులు దాటి వినిపించింది. జానపదమై పల్లెజీవులను ఉల్లాస పరిచింది. ఉద్యమగీతమై జనులను జాగృతం చేసింది. ఇప్పుడు, యూట్యూబ్ వేదికగా ‘నిన్నేమన్నా అంటినా.. నీ సొమ్మేమన్నా తింటినా’ అంటూ దుమ్ము లేపుతున్నది. ‘మందు వెట్టినావురో రాములో రాములా’ అని మాయ జేస్తున్నది. కానిపర్తిలో కాళ్లకు పట్టీలు తొడిగినప్పుడు మొదలై, జమ్మికుంటలో జై తెలంగాణ అని నినదించి, నేడు జానపద జాతరలో జోరు మీదున్నది మామిండ్ల మౌనిక పాట.
మౌనిక వాళ్లక్క పద్మావతి మంచి గాయని. అక్కలా తానూ పాడాలనుకుంది. అక్కను అనుసరిస్తూ సాగిన మౌనిక పాటల ప్రస్థానం ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నది. హై పిచ్ గొంతుతో జానపద ప్రేమికులను మెప్పిస్తూ కొత్త కొత్త పల్లె పదాలతో అలరిస్తున్న మామిండ్ల మౌనిక మనసులో మాట…
మా నాన్న మామిండ్ల మల్లయ్య చిన్నపాటి రైతు. అమ్మ శ్యామల. మాకు ఏం కావాలన్నా అమ్మనే చూసుకుంటది. మేం ఇద్దరం అక్కాచెల్లెండ్లం. అక్క పద్మావతి. వాస్తవానికి మాది వరంగల్జిల్లా కానిపర్తి. చిన్నప్పుడు అక్కా, నాన్న ఒక పార్టీ. నేనూ, అమ్మ ఒక పార్టీ. ఉన్నదాంట్ల తృప్తి పడుతూ నిమ్మళంగా ఉన్నం. మా కోసం పొద్దుందాక, తెల్లందాక కష్టపడుతుండె మావోళ్లు. ప్రేమానురాగాలే మా ఇంట్ల తులతూగే సంపదలు.
అక్కకు చిన్నప్పటి నుంచే పాటలు పాడటం అలవాటైంది. స్కూల్ల్లోగానీ, ఊళ్లోగానీ ఏదైనా కార్యక్రమం జరిగితే అక్క పాడుతుండేది. పాటల గలగలలతో ఇల్లు ప్రశాంతంగా ఉండేది. ఇలాంటి సంతోషాల మధ్య ఒక భయానకమైన రోజు. నేనప్పుడు ఆరో తరగతి. బ్యాగులు సర్దుకోమన్నరు. నలుగురమూ బయల్దేరి ఊరు దాటినం. కానిపర్తికి ఇక టాటా అని అప్పుడు అర్థమైంది మాకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయినం.
జమ్మికుంటలోనే గ్రాడ్యుయేషన్ దాకా సాగింది. మమ్మల్ని చదివించడమే అమ్మానాన్నల పెద్ద లక్ష్యం. మేం కూడా బాగానే చదివేవాళ్లం. అక్క చదువుతోపాటు పాటలు కూడా నేర్చుకున్నది. దయా నర్సింగ్ అంకుల్ అప్పటికే పేరున్న కళాకారుడు. ఆయన మా నాన్నకు పరిచయం. అంకులే మొదటగా అక్క టాలెంట్ను గుర్తించిండు. పాటలు ఎలా పాడాలో చెప్పిండు. అట్లా అక్క బయట పాటలు పాడేందుకు కూడా వెళ్తుండె. ఆమె వెంట నేనూ టైంపాస్ కోసం వెళ్లేదాన్ని. కానీ, నాకు తెలియకుండానే అక్క పాట నామీద ప్రభావం చూపింది. నాకూ ‘పాడాలె’ అనే ఆశ పుట్టింది.
అది 2007. దయా నర్సింగ్ అంకుల్ వాళ్లది ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండె. అక్కతో పాటు నేనుకూడా వెళ్లిన. పెద్ద పెద్దోళ్లు హాజరైండ్రు. మంచి మంచి పాటలు పాడుతున్నరు. అప్పటికే నాకు డ్యాన్స్ వచ్చు. భుజమ్మీద గొంగడేసి, కాళ్లకు గజ్జెలు కట్టుకొని స్టేజీమీద ప్రతీ పాటకు డ్యాన్స్ చేసిన. ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. నాకేమో పాడాలని ఉండేది. అవకాశమేమో దొర్కకపోతుండె. ప్రోగ్రామ్ అయిపోయేదాకా అక్కడే ఉండి ఏడ్సుకుంట ఇంటికొచ్చేదాన్ని. అమ్మా నాన్నలు ‘నీగ్గూడా మంచి రోజొస్తది. ఏడ్సుకుంట కూసుంటే సాధిస్తవా?’ అని చెప్పి నాలో ధైర్యం నింపిండ్రు. ఆ మాటలు నాకు కొత్త బలాన్ని ఇచ్చినయి.
2009. కనపర్తి గ్రామం. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్నది. కనపర్తిలో ప్రజాచైతన్య యాత్ర. బాల్రాజ్ అంకుల్ ఆ కార్యక్రమాన్ని మొదలువెట్టిండు. పాదయాత్రగా ఊరూరూ తిరుగకుంట ప్రజలను చైతన్యపరచాలె. ఆ కార్యక్రమం నా గళానికి అవకాశం కల్పించింది. ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు. దయా నర్సింగ్ అంకుల్ నేర్పిన మెలకువలు, బాబ్జ్జీ గారు చెప్పిన టెక్నిక్స్తో నేను పాడిన పాట జనాల్లోకి వెళ్లింది. అట్లా తొలిసారిగా నేను ‘గోదారి గోదారీ ఓహో పారేటి గోదారీ.. సుట్టూ నీళ్లువున్న సుక్కాదక్కని ఎడారి ఈ భూమీ.. మాదీ తెలంగాణ భూమీ’ అనే ఉద్యమగీతం పాడిన. ఈ పాట ఒరిజినల్ సింగర్ రమాదేవక్క. అప్పటినుంచి నేను ఏ వేదిక ఎక్కినా ఈ పాటే పాడిపించుకునేవాళ్లు. అక్కా, నేను ధూమ్ధామ్ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే కొందరు విచిత్రంగా చూస్తుండె. తక్కువ చేసి మాట్లాడుతుండె. మేం అవేవీ పట్టించుకోలేదు.
పాటతో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నానంటే ఆ క్రెడిట్ అంతా అమ్మానాన్నలదే. నేను చాలామందిని చూసిన. పాడదామని ఉన్నా పేరెంట్స్ ఒప్పుకోకపోవుడుతో ఇంటికే పరిమితమైండ్రు. కానీ మా నాన్నయితే ‘నువ్వు కచ్చితంగా పాడాల్సిందే’ అని ప్రోత్సహించిండు. ఆయనకు పాటలంటే చానా ఇష్టం. అమ్మకూడా పాడుతది. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా నన్నూ, అక్కనూ నాన్నే తీసుకెళ్లేటోడు. ఒక్కొక్కసారైతే కాలేజీకి వచ్చి సార్తో మాట్లాడి ‘ఈ రోజు ఫలానా ఏరియాలో ప్రోగ్రామ్ ఉంది. మంచిగా పాడాలె’ అని తీసుకెళ్తుండె. అప్పుడప్పుడు అనిపిస్తుంటది.. ‘పాపం, మా వల్ల నాన్న ఇబ్బంది పడుతుండు. పనులు కూడా ఆగం జేసుకొని మాకు తోడుగా వస్తుండు’ అని. అమ్మయితే, మేం ఇంటికి వచ్చేదాక ఎదురుచూసుకుంటనే ఉండేది.
గంట గంటకూ ఫోన్చేసి ‘ఏ పాట పాడుతున్నవ్. పాడినవా?’ అని అర్సుకునేది.
ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం.. ‘రాములో రాములా’ పాట. అది ఇంత హిట్ అవుతుందని నేను అనుకోలేదు. నా పాటల ప్రయాణంలో మానుకోట ప్రసాదన్న ‘నువ్వు పాడగలవు’ అని భరోసా ఇస్తే, ‘నువ్వు బాగా పాడగలవు’ అని మాట్ల తిరుపతన్న ధైర్యమిచ్చిండు. సైటీవీ ‘రాముల’ పాట 100 మిలియన్ల వ్యూస్కు చేరువలో ఉన్నది. ఆ పాట తర్వాత నా కెరీర్ మారిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినయి. ఇప్పుడు నేనే స్వతహాగా ‘మౌనిక అఫీషియల్’ అనే చానెల్ పెట్టిన. మొదాలు ‘సిక్కూదీసి కొప్పుకట్టి.. కొప్పునిండా పూలు వెట్టి’ పాట, తాజాగా మహిళా దినోత్సవం పాట పెట్టిన. నా రాతే మారిపోయేటట్లు చేసిన పాటకు వందనం.
తెలంగాణ వచ్చింది. సాంస్కృతిక సారథిలో ఉద్యోగం. జీవితం హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్లాలన్నా పైసల్లేకుండేవి. ఒకసారైతే డబ్బుల్లేక అమ్మ తన చెవికమ్మలు కుదువబెట్టి ఆ పైసలతో ప్రోగ్రామ్కి పంపింది. అలా చేతిల వంద రూపాయలుకూడా లేని స్థితినుంచి ఈ స్థాయికి వచ్చామంటే అది పూర్తిగా పాట పుణ్యమే. మాకు కష్టాలు రావొద్దని ఆకాంక్షించిన పేరెంట్స్ హ్యాపీగా ఉండ్రు. మేమూ హ్యాపీగా ఉన్నం. ఇంతేనా? ఇంకేదో చేయాల్సింది ఉందని అనిపించింది.
అప్పటిదాకా పాడింది ఒకెత్తు. యూ ట్యూబ్లో పాడటం ఒకెత్తు. నా ఆసక్తిని గమనించి మానుకోట ప్రసాదన్న తొలిసారిగా ‘మానుకోట పాటలు’ చానెల్కోసం ‘కట్టమీద కూసున్నాడే సక్కని సూపుల సిన్నోడే’ పాటకు అవకాశం కల్పించి, ‘మౌనిక పాడగలదు’ అని ప్రపంచానికి తెలియజేసిండు.
నాకు అమ్మంటే సెంటిమెంట్. మాకోసం ఏం చేసిందో కండ్లారా చూసిన. అమ్మ గొప్పదనాన్ని చాటుతూ మదర్స్ డే సందర్భంగా ‘నెత్తుటి ముద్దయి.. నేలన పడ్డా.. కోటి నొప్పుల గురుతై పుడితివె అమ్మా.. ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే’ పాట పాడిన. ప్రస్తుతం, అమ్మకు దూరంగా హైదరాబాద్లో ఉంటున్న. ఈ పాట విన్నప్పుడల్లా అమ్మ గుర్తుకొస్తది. చాలామంది ఎందుకు పిల్లను పంపించడం అంటుంటే.. అమ్మ మాత్రం అవేవీ పట్టించుకోకుండా పంపేది. నేను పాడిన అమ్మపాట వినగానే అమ్మ ఏడ్చింది. నా ప్రతీ పాటకు మొదటి ప్రశంస వినేది అమ్మనుంచే. మాకోసం నిరంతరం తపించే అమ్మానాన్నలంటే నాకు చాలా ఇష్టం.
… దాయి శ్రీశైలం