మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలకు జీవం పోసిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. బుధవారం జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామయ్య, ఆయన సతీమణి జానమ్మతో కలిసి మొక్కలు నాటి గార్డెన్ను పరిశీలించారు.
అనంతరం రామయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ధైవకార్యంగా మొక్కలను పెంచాలని సూచించారు. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దని, సైన్స్ను నమ్మాలని సూచించారు. ప్రకృతి రక్షణ కోసం విద్యార్థులు సైన్యంగా భాగస్వాములు కావాలన్నారు. జడ్చర్లలోని బొటానికల్ గార్డెన్ ఏర్పాటును ఆయన అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సదాశివయ్య, డీఎఫ్వో గంగారెడ్డి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు శంకర్రావు, నాగరాజు, రవికిరణ్, పీయూ ఎన్ఎస్ఎస్ ప్రోగాం కోఆర్డినేటర్ అనురాధరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.