‘థియేటర్లలో విడుదలైన రెండు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేసే సంస్కృతికి నేను వ్యతిరేకం. ప్రస్తుత బిజినెస్ పరంగా ఆలోచిస్తే అది లాభదాయకమే కానీ.. భవిష్యత్తు పరంగా చూసుకంటే ఈ విధానం వల్ల థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది’ అని అన్నారు బన్నీవాస్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో బన్నీవాస్ పాత్రికేయులతో ముచ్చటించారు.
మార్చురీ వ్యాన్ డ్రైవర్ కథ ఇది. వితంతువైన ఓ మహిళను తొలిచూపులోనే అతడు ఇష్టపడతాడు. స్మశానంలో ఆమెకు తన ప్రేమను వ్యక్తంచేస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో మొదలైన వారి ప్రేమ ఎలా విజయతీరాలకు చేరుకుందనేది దర్శకుడు కౌశిక్ హృద్యంగా తెరకెక్కించారు. రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా కుటుంబ విలువల సమ్మేళనంగా ఈ సినిమా సాగుతుంది. తొలుత కార్తికేయ బాడీలాంగ్వేజ్కు ఈ కథ సెట్ కాదనుకున్నా. కానీ దర్శకుడు కౌశిక్ మాత్రం పట్టుబట్టి కార్తికేయను తీసుకున్నారు. నన్ను నమ్మి ఏడాది పాటు కార్తికేయ ఈ సినిమాపై మాత్రమే దృష్టిపెట్టాడు. క్లాస్ కథల్ని మాస్ పంథాలో చెప్పడం ప్రధానమని నేను నమ్ముతా. ఆ సూత్రాన్ని నేను చేసే ప్రతి సినిమాకు అన్వయిస్తుంటా. అదే నా సక్సెస్ సీక్రెట్గా భావిస్తా.
గతంలో ఓ సినిమా బాగుంటే రెండు వారాలు ఆడేది. కానీ ఇప్పుడు సినిమా బాగున్నా రెండో వారం థియేటర్లలో నిలదొక్కుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రతివారం నాలుగైదు సినిమాలు విడుదలవుతుండటం వల్లే ఆ పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీ బాగుండాలంటే ఈ ఏడాది మొత్తం నిర్మాతలు అడ్జెస్ట్ కావాల్సిందే. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తోన్న సినీ పరిశ్రమ ఇంకా గాడిన పడలేదు. తెలుగులో మినహా మిగిలిన భాషల్లో థియేటర్ రెవెన్యూ చాలా తక్కువగా ఉంది. నిర్మాతల అదృష్టం.. ప్రేక్షకుల గొప్పమనసు వల్ల తెలుగు సినిమాలు చక్కటి వసూళ్లు సాధిస్తున్నాయి. కంటెంట్ బాగున్న సినిమాలు ఆడుతున్నాయి. కరోనా భయాలన్నీ తొలగిపోయి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే మరో ఏడాది పట్టొచ్చు.
స్నేహాన్నీ వ్యాపారంతో ముడిపెట్టకూడదని నేను నమ్ముతా. అల్లు అర్జున్తో సినిమా కంటే అతడితో ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యం. మా స్నేహంలో ఎలాంటి అరమరికలు రాకూడదనే ఇన్నాళ్లు ఆయనతో సినిమా చేయలేదు. బన్నీ అడగటంతోనే కొరటాల శివతో చేస్తోన్న నిర్మాణంలో భాగమయ్యా. సెప్టెంబర్లో ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
సినిమాలు రెండు వారాల్లో ఓటీటీలో విడుదలవుతాయనే నమ్మకం ప్రేక్షకుల్లో బలపడితే ప్రేక్షకులు థియేటర్లకు రారు. టెక్నాలజీ డెవలప్కావడం మంచిదే సినిమా చూసే ఆనందాన్ని అది చంపేయకూడదు. మా సంస్థలో రూపొందే సినిమాల్ని యాభై రోజుల తర్వాతే ఓటీటీలో విడుదలచేస్తాం.
గీతా ఆర్ట్స్, జీఏ-2 సంస్థలపై ఈ ఏడాది ఆరు సినిమాలు విడుదలకాబోతున్నాయి. అఖిల్తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది. దర్శకుడు సుకుమార్తో కలిసి నిర్మిస్తున్న 18పేజేస్’ చిత్రీకరణ పూర్తయింది. మారుతి, గోపీచంద్ కలయికలో వస్తోన్న ‘పక్కా కమర్షియల్’ చిత్రీకరణ జరుగుతోంది. వరుణ్తేజ్ ‘గని’, శిరీష్ సినిమాతో పాటు హిందీ ‘జెర్సీ’ చిత్రాలు ఈ ఏడాది విడుదలకానున్నాయి. వచ్చే ఏడాది రాహుల్ రవీంద్రన్తో ఓ మహిళా ప్రధాన సినిమా చేయబోతున్నా. దర్శకుడు ప్రశాంత్నీల్, బన్నీ కలయికలో గీతా ఆర్ట్స్లో సినిమా ఉంటుంది.