అహ్మదాబాద్, మార్చి 12: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వచ్చే ఏడాదికి 75 ఏండ్లు పూర్తికానున్న నేపథ్యంలో.. కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. 2023 ఆగస్టు 15 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని ప్రధాని వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ సారథ్యంలో 1930 మార్చి 12న చేపట్టిన దండియాత్ర.. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో కీలక ఘట్టంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రను పురస్కరించుకొని 81 మంది సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు యాత్రను చేపట్టారు. ఏప్రిల్ 5న ఇది ముగుస్తుంది.
‘రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల మనం గర్విస్తున్నాం. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి. దీనిని బలోపేతం చేసే దిశగా మనం పయనిస్తున్నాం. భారత్ సాధించిన విజయాలు మనకు మాత్రమే కాదు. ప్రపంచానికి కూడా అవి వెలుగులు నింపుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచాభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. ఐదు స్తంభాలు- స్వాతంత్య్రోద్యమం, ఆలోచనలు@75, విజయాలు@75, కార్యాచరణలు @75, సంకల్పాలు @75 – నేడు మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రస్తావించిన ఆయన.. ఈ చరిత్రను పరిరక్షించేందుకు గత ఆరేండ్లుగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దండియాత్రకు సంబంధించిన ప్రాంతాన్ని రెండేండ్ల కిందట పునరుద్ధరించినట్టు చెప్పారు. అలాగే దేశంలో తొలి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనంతరం నేతాజీ సుభాష్చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రాంతాన్ని కూడా పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్కు సంబంధించిన ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. జలియన్వాలా బాగ్, పైకా ఉద్యమ స్మారకాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం ప్రధాని నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ బాపూజీకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశ్రమంలో 1918-30 మధ్య గాంధీజీ నివసించిన ఇల్లు హృదయ్కుంజ్ను సందర్శించారు. స్వాతంత్య్రోద్యమానికి, స్వాతంత్య్ర సమరయోధులకు ఈ మహోత్సవ్ నివాళి అని ఆయన సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆశ్రమం పక్కనే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకించారు. అంతకుముందు మోదీ ట్వీట్చేస్తూ, దండియాత్ర ప్రారంభమైన సబర్మతి ఆశ్రమం నుంచి అమృత్ మహోత్సవ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ యాత్ర భారతీయుల్లో ఆత్మనిర్భర స్ఫూర్తిని నిలిపిందని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను వాడటమే బాపూజీకి, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను కొని, ఫొటో తీసి, వోకల్ ఫర్ లోకల్ అనే ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, ఇతర సాంఘిక దురాచారాలను రూపుమాపడమే స్వాతంత్య్ర సమరయోధులకు మనమిచ్చే అసలైన నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ఆయన ఫేస్బుక్ ద్వారా స్పందించారు. భారత పథంలో ఇది కీలక ఘట్టమని, బాపూజీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని మరోసారి స్మరించుకునేందుకు ఇదో అవకాశమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ నేతృత్వంలోని నిరంకుశ శక్తుల్లో దేశం క్రమంగా బందీ అయిపోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. స్వేచ్ఛ కోసం మహాత్ముడి మార్గంలో పయనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ పాలకులు ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ సారథ్యంలో 1930 మార్చి 12న దండియాత్ర చేపట్టారు. శుక్రవారం ‘దండియాత్ర’ వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ ఫేస్బుక్లో ఈ పోస్టు చేశారు.