న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డం పెరుగుతున్న ఫొటోలను ఐదు షేర్ చేస్తూ జీడీపీ మీమ్ తయారు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. అయితే, ఈ మీమ్లో లాజిక్ మిస్ కావడంతో కేంద్ర మంత్రి మురళీధరన్ ఇట్టే పట్టేసి.. ‘మీ ఆరోగ్యం బాగోలేదనుకుంటాను.. వైద్యులకు చూపించుకోండి’ అన్న అర్ధం వచ్చేలా ట్విట్టర్లో సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం ప్రధాని మోదీకి పెరుగుతున్న గడ్డాన్ని దేశ జీడీపీతో పోల్చుతూ ట్విట్టర్లో మీమ్ పోస్ట్ చేశారు. లాక్డౌన్ సమయం నుంచి ప్రధాని మోదీ గడ్డం పెరుగుదల కొనసాగుతుండగా.. 2017 నుంచి 2019-20 వరకు భారత జీడీపీ గణాంకాలను పోలుస్తూ శశి థరూర్ ట్వీట్ చేశారు. ‘ఇది గ్రాఫిక్ ఇలస్ట్రేషన్’ అని అర్థం చేసుకోవాలని కామెంట్ పెట్టారు. గ్రాఫిక్లో జీడీపీ 2017 నాలుగో క్వార్టర్లో 8.1 శాతంగా ఉండగా.. అది 2019 రెండో క్వార్టర్కు వచ్చే సరికి 4.5 శాతానికి చేరుకున్నదని మీమ్లో తెలిపారు. ఈ మీమ్ను షేర్ చేసిన కేంద్ర మంత్రి మురళీధరన్.. శశి థరూర్పై కాస్తా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మోదీ గడ్డం పెరుగుతుండటాన్ని తగ్గిపోతున్న జీడీపీతో పోల్చడంలో శశి థరూర్ లాజిక్ మరిచిపోయారు. దీన్ని పట్టేసిన కేంద్ర మంత్రి మురళీధరన్.. ‘శశి థరూర్.. మీరు త్వరగా కోలుకోండి.. మీకు వైద్యం చేసేందుకు ఆయుష్మాన్ భారత్ కింద దవాఖానకు సూచిస్తాను.. మీ ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని కామెంట్ పెట్టారు. మరో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా శశి థరూర్ ట్విట్టర్ మీమ్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.