హపూర్ : యూపీలో నేరగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. కంప్యూటర్ క్లాసుల కోసం సమీప గ్రామం నుంచి హపూర్కు వచ్చిన బాలికపై ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. బాలిక తలపై గురిపెట్టి నిందితుడు కాల్పులు జరపగా ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. హపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేడీ కాలేజ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మీరట్ దవాఖానకు తరలించారు.
సబ్లి గ్రామానికి చెందిన బాలిక తలపై నిందితుడు కాల్పులు జరిపాడని, ఈ ఘటనకు ముందు వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారని స్ధానికులు చెప్పారు. నిందితుడిని అశోధ గ్రామానికి చెందిన భూషణ్ శర్మ అలియాస్ అభిషేక్గా గుర్తించారు. బాలికపై కాల్పులు జరిపిన అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని హపూర్ ఎస్పీ నీరజ్ జడాన్ తెలిపారు.